చెట్లు ఎక్కడం సామాన్యమైన విషయం కాదు.అందుకే మనకు అందుబాటులో వున్న చెట్ల కొబ్బరి బొండాలు తాగాలంటే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది.
ఎవరో వచ్చి వాటిని కోసేదాకా పడిగాపులు కాస్తూ ఉంటాం.ముఖ్యంగా కొబ్బరి తోటలు వేసుకున్న రైతులు చాలా కష్టపడాల్సి వస్తుంది.
వాటిని కొంతమంది కూలివాళ్ళ సాయంతో తెంపుతూ వుంటారు.దాంతో వారికి పెద్దగా గిట్టుబాటు ధర పలకదు.
అలాంటి రైతుల కష్టాన్ని గమనించిన కర్నాటకకు చెందిన “కోమలే గణపతి భట్” అనే రైతు దీనికి అదిరిపోయే ఆలోచన చేసాడు.

అనుకున్నదే తడవుగా 2019లో ఆయన ఒక పరికరాన్ని రూపొందించాడు.ఇది కొబ్బరి చెట్టుపైకి త్వరగా ఎక్కడానికి ఉపయోగపడుతుంది.ఈ పరికరం అప్పట్లో వ్యాపార దిగ్గజం మహీంద్రా గ్రూప్ చైర్మన్ శ్రీ ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది.
ఆ తర్వాత కాలంలో కోమలే గణపతి భట్ ఈ ‘ట్రీ బైక్’ని రూపొందించడంతో తనపనైపోయిందని కూర్చోకుండా దానిని సాంకేతికంగా మరింత మెరుగుపరచటానికి అనేక మార్గాలను వెతికాడు.ఇందుకోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేయసాగాడు.

కట్ చేస్తే 51 ఏళ్ల వయస్సులో, అతను చేపట్టిన ప్రయత్నం ఫలించింది.అవును, ఇపుడు ఆయన చేసిన ప్రయత్నం వలన ఓ కొత్త ఆవిష్కరణ రైతుల పాలిట వరంగా మారింది.కోమలే గణపతి భట్ రూపొందించిన ఈ కొత్త ‘ట్రీ బైక్’ 45 కిలోల బరువుంది.ట్రాలీతో సులభంగా రవాణా చేయవచ్చు.ట్రీ బైక్ వాహనం పెట్రోల్తో నడుస్తుంది.1 లీటర్ పెట్రోల్తో కనీసం 70 నుండి 80 చెట్లను ఎక్కవచ్చు అని చెబుతున్నాడు.5 నుండి 15 అంగుళాల మందం ఉన్న చెట్లపై బైక్ను ఉపయోగించవచ్చు.ఈ ట్రీ బైక్ 360 డిగ్రీల కోణంలో కూడా తిరుగుతుంది.
కొబ్బరి చెట్లతో పాటు, మామిడి , పనస చెట్ల పైకి ఎక్కేందుకు దీనిని ఉపయోగించవచ్చు.







