ఈ స్మార్ట్ యుగంలో పనులన్నీ ఆన్ లైన్లోనే జరిగిపోతున్నాయి.కోవిడ్ పుణ్యమాని ఈ మెరుపు కాస్త తొందరగానే జరిగిందని చెప్పుకోవాలి.
ఈ క్రమంలో చదువులు ఎక్కువగా ఆన్ లైన్ అయిపోయాయి.ఇపుడు ఎక్కడన్నా, ఎలాగన్నా చదువుకోవచ్చు అనే ధీమా రావడంతో ప్రభుత్వాలు కూడా అదే దిశగా ప్లాన్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం భారత్ లో డిజిటల్ యూనివర్శిటీ పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ యూనివర్శిటీ అందుబాటులోకి వస్తుందని యూజీసీ చెప్పింది.

దీనిద్వారా విద్యార్ధులు కోరుకున్న కోర్సు ఏదైనా ఆన్ లైన్లోనే అందించనున్నారు. కొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రపంచస్థాయి ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆదేశాలతో యూజీసీ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా మొదలు పెడుతోంది.ఈ నేపథ్యంలో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థలను ఈ డిజిటల్ యూనివర్శిటీలోకి భాగస్వాములుగా చేరనున్నాయి.క్లాసులు నిర్వహించడం, పరీక్షలు, సర్టిఫికెట్లు అన్నీ మామూలు యూనివర్శిటీలో జరిగినట్టే జరుగుతాయని తెలుస్తోంది.

ఇకపోతే విద్యార్ధులు అప్పటికే ఒకచోట చదువుతూ ఉన్నా కూడా ఇందులో కూడా మళ్ళీ వేరే కోర్స్ జాయిన్ అయ్యే అవకాశం కలదు.క్రెడిట్లు కూడా అందుకోవచ్చు.సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీలను ఈ క్రెడిట్ల ఆధారంగా అందుకోవచ్చు.ఈ డిజిటల్ యూనివర్శిటీలో సీట్లు లేవనే సమస్య అనేదే ఉండదు.అలాగే ప్రవేశ పరీక్షలు కూడా ఏమీ ఉండవు.విద్యార్ధులకు ఏ కోర్సులో ఆసక్తి ఉందో దాన్ని నేరుగా అభ్యసించవచ్చును.
ప్రస్తుతానికి సర్టిఫికెట్, డిప్లోమా, డ్రిగ్రీలతో ఫ్రారంభమయ్యే ఈ వర్శిటీ సేవలు ముందు ముందు పీజీ, డాక్టరేట్లను కూడా అందించే విధంగా అప్ గ్రేడ్ చేస్తామని చెబుతోంది యూజీసీ.







