తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.100% ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాశాఖ ముందడుగులు వేస్తోంది.దీనిలో భాగంగా గత ఏడాది డిసెంబర్ నెల నుండి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ… సాయంత్రం పూట అల్పాహారాన్ని అందిస్తూ ఉంది.
ఇదే సమయంలో మారిన పరీక్షల విధానం పై విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహిస్తూ ఉంది.
ఫైనల్ పరీక్ష ఒత్తిడి భయం పోగొట్టే దిశగా విద్యాశాఖ ఈ రకంగా విద్యార్థులను ముందుగానే సిద్ధం చేస్తుంది.వచ్చేనెల 3వ తారీకు నుంచి 13వ తారీకు వరకు జరిగే పదవ తరగతి పరీక్షల విషయంలో తాజాగా తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

విషయంలోకి వెళ్తే పదవ తరగతి పరీక్ష కేంద్రాలన్నిటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించడం జరిగింది.ప్రశ్నాపత్రాలు ఓపెన్ చేసిన నాటి నుండి మళ్లీ ప్యాక్ చేసేవరకు అన్నిటినీ రికార్డ్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది.ఇదే సమయంలో ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలు సొంతంగా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరింది.దాదాపు ఈ ఏడాది 5.1 లక్షలమంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు.







