ఈమధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం విషయంలో బాగా ఇబ్బందిపెడుతున్న అంశం స్పామ్ మెసేజులు. అవును, మనకి అనేకరకాలుగా సైబర్ నేరగాళ్లు వల వేస్తూ వుంటారు.‘ఇంట్లో ఉంటూనే రోజుకి వేలల్లో సంపాదించుకోండి,’కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే మీ కార్డు బ్లాక్ అయిపోతుంది,’ ఈ సైట్ మీకు ఒక్క రూపాయికే స్మార్ట్ ఫోన్ అందిస్తుంది… వంటి మెసేజెస్తో సైబర్ నేరగాళ్లు ఊరిస్తూ వుంటారు.కొంతమంది వాటి మోసం తెలియక మోసపోతూ వుంటారు.
ప్రతిరోజూ ఇలాంటి వాటివలన దేశంలో కొన్ని వేలమంది మోసపోయారని తాజా సర్వేలు చెబుతున్నాయి.

అయితే త్వరలో మీకు ఈ పీడ విరగడ కానున్నది.అవును, ఏది స్కామ్, ఏది స్పామ్? దేన్ని నమ్మాలో ఇకనుండి ఈజీగా తెలుసుకొని ఇలాంటి స్పామ్ మెసేజ్లను కట్టడి చేసే కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది.మన హైదరాబాద్కు చెందిన ఓ ఐటీ కంపెనీ ఈ మేరకు ఓ సాఫ్ట్వేర్ను ఆవిష్కరించడం గొప్ప విషయం అని అనుకోవాలి.
సోమవారం స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగిన ప్రపంచస్థాయి సదస్సులో హైదరాబాద్కు చెందిన తాన్ల అనే ఐటీ కంపెనీ వైజ్లీ ఏటీపీ పేరుతో రూపొందించిన సాఫ్ట్వేర్ పనితీరును ప్రదర్శించింది.

దీని ద్వారా దాదాపుగా 99శాతం వరకు స్పామ్, ఫిషింగ్ మెసేజ్లను కట్టడి చేయవచ్చని నిరూపితమైంది.కాగా వినియోగదారులకు త్వరలో ఇది అందుబాటులోకి రానుంది.సెల్ఫోన్లకు వచ్చే అనుమానిత మెసేజ్లను గుర్తించే వైజ్లీ ఏటీపీ ఎండ్ టు ఎండ్ ఫిషింగ్ ప్రొటెక్షన్ ప్లాట్ఫామ్ను వీరు అందుబాటులోకి తేవడం జరిగింది.
ఇది ఫోన్లకు వచ్చే స్పామ్ మెసేజ్లను నిరోధిస్తుంది.ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ మోసాల వల్ల 55 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతున్నదని గ్లోబల్ యాంటీ స్కామ్ అలయెన్సెస్ తాజాగా ఓ ప్రకటనలో తెలపడం శోచనీయం.







