బాపట్ల, సూర్యలంక బీచ్ ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.
రోజా ప్రకటించారు.బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో మంత్రి గురువారం పర్యటించారు.
పర్యాటక శాఖ ఆధీనంలో నడుస్తున్న హరిత బీచ్ రిసార్ట్ లో మంత్రి కొంతసేపు గడిపారు.పర్యాటకులకు ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రిసార్టులోని అతిధి గృహాలు, సమావేశ మందిరం, అందుబాటులో ఉన్న వనరులను ఆమె పరిశీలించారు.అనంతరం మీడియాతోనూ ఆమె మాట్లాడారు.
సూర్యలంక బీచ్ ని సుందరంగా తీర్చిదిద్దుతూ మరింత అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి తెలిపారు.పర్యాటకులను ఆకర్షించడానికి అహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు.
ఆ దిశగా అభివృద్ధి పనులకు త్వరలో భూమి పూజ చేస్తామన్నారు.రాష్ట్రంలో విశాఖపట్నం బీచ్ తర్వాత రెండవస్థానంలో సూర్యలంక బీచ్ ఎంతో ప్రాచూర్యం పొందిందన్నారు.
సూర్యలంక బీచ్ లో పర్యాటకులు ధైర్యంగా స్నానాలు ఆచరించడానికి సురక్షిత ప్రాంతమని ఆమె తెలిపారు.
ప్రతివారం సెలవుదినాల్లో సుమారుగా 15 వేలమందికి పైగా పర్యాటకులు సూర్యలంక బీచ్ కు వస్తున్నారని ఆమె వివరించారు.కార్తీకమాసం వంటి పండుగ సమయాల్లో 1.5 లక్షలమంది ప్రజలు తీరప్రాంతానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారన్నారు.అలాగే సముద్ర స్నానాలు ఆచరించడం ఇక్కడ ప్రత్యేకత అని ఆమె చెప్పారు.ఈ నేపథ్యంలో సూర్యలంకను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.ప్రస్తుతం మూడు ఎకరాల విస్తీర్ణంలో 34 గదులతో రిసార్ట్ నడుపుతున్నామన్నారు.వారాంతంలో సందర్శకులకు అవి చాలడంలేదని, పర్యాటకుల నుంచి డిమాండ్ అధికంగా ఉందన్నారు.
హైదరాబాద్ వంటి నగరాల నుంచి కూడా సూర్యలంక ప్రాంతానికి ప్రజలు అధికంగా వస్తున్నారని తెలిపారు.
పర్యాటక ప్రాంతాలను ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని మంత్రి రోజా తెలిపారు.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్రస్థాయిలో సమీక్ష జరిగిందన్నారు.అందులో భాగంగానే పర్యాటక ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.
త్వరలో విశాఖపట్నంలో టూరిజం సమ్మెట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.పర్యాటక ప్రాంతాలలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి చేయడానికి ప్రైవేట్ సంస్థలను భాగస్వాములను చేస్తామన్నారు.
సూర్యలంక బీచ్ వద్ద పర్యాటక శాఖకు ఎనిమిది ఎకరాల భూమి ఉందన్నారు.ఆ భూమిలో బహుళజాతి హోటళ్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అభివృద్ధి పనులకు త్వరలో భూమిపూజ చేస్తామన్నారు.కోవిడ్ విపత్తుతో గడిచిన రెండేళ్లుగా ప్రపంచమంతా పర్యాటకరంగం కుదేలయ్యిందన్నారు.
ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారని వివరించారు.సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు.అలా పనిచేయడంతోనే దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ టాప్-5లో నిలిచిందన్నారు.పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా వనరులు సమకూరుస్తామని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ఏ.డి.మల్లిరెడ్డి, ఆర్.డి.శ్రీనివాస రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ ఇన్ఛార్జి అధికారి పి.సురేష్, బాపట్ల ఆర్.డి.ఓ.జి.రవీందర్, తదితరులు పాల్గొన్నారు.







