ఏపీ అధికార పార్టీ వైసీపీలో రోజురోజుకు దిక్కర స్వరాలు పెరిగిపోతున్నాయి.ఇప్పటికే ఓ ఎంపి, ఇద్దరు ఎమ్మెల్యేలు రెబెల్ గా మారగా, ఇప్పుడు అదే బాటలో మరో ఎమ్మెల్యే పయనం అవుతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
అది కూడా నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కావడం ఆసక్తికరంగా మారింది.వైసిపి 2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది.
మొత్తం జిల్లాలోని పది నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగరవేసింది.ఇప్పుడు అదే ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి తిరుగుబావుట ఎగురవేస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుండడం ఆ పార్టీలో ఆందోళన కలిగిస్తుంది.
తాజాగా నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వం తీరుపై మీడియా ముందు ఫైర్ అయ్యారు.
‘సిమెంట్ రోడ్డు వేయలేం.డబ్బులు లేవు.నిర్మించిన రోడ్లకు ప్రభుత్వం నగదు ఇవ్వకపోవడంతో వేసిన వారు అప్పుల పాలయ్యారు.
చేసిన పనులకు బిల్లులు ఇవ్వక కొంతమంది నష్టపోయారు ” అంటూ చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు.ఆయన ఈ విమర్శలు చేస్తున్న సమయంలో మీడియా వారు ఉన్నారని ఎమ్మెల్యేను పక్కనున్న నాయకులు అప్రమత్తం చేసే ప్రయత్నం చేయగా.
మీడియా ఉంటే ఏం చేయాలి ? పనులు చేసిన వాళ్లకు డబ్బులు రాలేదు.ఎవరు చెప్తారో చెప్పండి అంటూ చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
వడ్డీలకు అప్పులు తెచ్చి ఎవరు సొమ్ములు పెట్టి రోడ్లు వేయగలరని ఈ సందర్భంగా ప్రశ్నించారు.కలిగిరి మండలం నాగసముద్రం సచివాలయ పరిధిలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న చంద్రశేఖర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు జిల్లాను వైసిపి కంచుకోట గా మార్చడం లో మేకపాటి ఫ్యామిలీ కృషి ఎంతో ఉంది.మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లు కీలకంగా వ్యవహరించారు.ఈ ఫ్యామిలీ నుంచి గౌతం రెడ్డి కి మంత్రి పదవి కూడా ఇచ్చారు.ఆయన ఆకస్మిక మరణం తరువాత మేకపాటి ప్యామిలీ లోనూ చిన్న పాటి విబేధాలు రావడం, చంద్ర శేఖర్ రెడ్డి ఇప్పుడు రెబల్ గా మారుతుండడం వంటివి అన్నీ వైసీపీ కి ఇబ్బందికరంగా మారాయి.