చేరికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బిజెపిలో ఒంటరి అయినట్టుగానే కనిపిస్తున్నారు.బిజెపిలో కేసీఆర్ కోవర్ట్ లు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే సృష్టించాయి.
ముఖ్యంగా తెలంగాణ బిజెపిలో ఈ వ్యాఖ్యలపై అగ్గిరాజుకుంది.ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను తప్పుపడుతూ పార్టీ నాయకులంతా స్పందించారు.
వీరందరి స్పందన తరువాత పార్టీలో రాజేందర్ ఒంటరి అయినట్టుగానే కనిపిస్తున్నారు.ఈ విషయంలో రాజేందర్ కు వ్యతిరేకంగా పార్టీ కీలక నాయకులు స్టేట్మెంట్లు ఇస్తుండడంతో రాజేందర్ దీనిపై ఏం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది .తాజాగా బిజెపి నేత విజయశాంతి ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై స్పందించారు.ఈటెల చెప్తున్నట్లుగా పార్టీలో కోవర్టులు ఉంటే వారిని పేర్లతో సహా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

నిజంగా కోవర్ట్ లు ఉంటే బిజెపి అధిష్టానం వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటుందని, అలా చేస్తే మీరు పార్టీకి మేలు చేసిన వారు అవుతారంటూ రాజేందర్ ను ఉద్దేశించి అన్నారు.ఊరికే కోవర్టులు ఉన్నారని చెప్పి తప్పించుకోవడం సరికాదు అంటూ ఆమె రాజేందర్ పేరు ప్రస్తావించకుండా విమర్శించారు.ఇక తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సైతం దీనిపై స్పందించారు.బిజెపిలో కోవర్ట్ లు ఎవరు ఉండరని, బిజెపి ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ అంటూ ఆయన మాట్లాడారు.
ఇక బిజెపి ఎంపీ లక్ష్మణ్ సైతం ఇదేవిధంగా వ్యాఖ్యానించారు.ఈటెల వ్యాఖ్యలను తప్పుపడుతూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను బీజేపీ సీనియార్లంతా విమర్శలు చేస్తూ ఉండడంతో, బిజెపిలో తాను ఒంటరి అయ్యాను అన్న ఫీలింగ్ రాజేందర్ లో కనిపిస్తోంది.
ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి సీఎం అభ్యర్థిగా ప్రచారం పొందుతున్నారు .

బిజెపి అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి రేసులో రాజేందర్ కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.దీనికి తగ్గట్లే తెలంగాణ సీఎం కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తాను ఆ నియోజకవర్గ నుంచే పోటీ చేసి ఆయనపై గెలుస్తానంటూ రాజేందర్ ప్రకటించడం, కేసిఆర్ స్థాయిలో తన స్థాయి ఉందనే విధంగా సంకేతాలు పంపడం వంటివి తెలంగాణ బిజెపి సీనియర్ నాయకులకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయట.ఇప్పుడు ఈ కోవర్ట్ ల అంశాన్ని రాజేందర్ లేవనెత్త గానే ఆయనపై ప్రత్యక్షంగా, పరోక్షంగా బిజెపి సీనియర్లంతా విమర్శలు మొదలుపెట్టారు.







