సోమవారం రాత్రి కెనడాలోని బ్రాంప్టన్లోని ఒక హిందూ దేవాలయంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.యాంటీ ఇండియన్ గ్రాఫిటీతో ‘గౌరీ శంకర్ మందిర్’ను వారు ధ్వంసం చేశారు.
ఇది కెనడాలో నివసిస్తున్న భారతీయ సమాజంలో ఆగ్రహానికి కారణమైంది.టొరంటోలోని భారత కాన్సులేట్ మాట్లాడుతూ, భారతదేశ వారసత్వానికి ప్రతీకగా ఉన్న ఆలయం భారతదేశం పట్ల ద్వేషపూరిత సందేశాలతో దెబ్బతింది అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆలయాన్ని ధ్వంసం చేయడం కెనడాలోని భారతీయుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు.మరోవైపు ఈ ఘటనపై కెనడా అధికారులు విచారణ చేపట్టారు.ఇలా దేవాలయాలపై విధ్వంసం సృష్టించడం ఇదే మొదటిసారి కాదు.జులై 2022 నుంచి కెనడాలో మూడు సార్లు ఇలాంటి విధ్వంసక చర్యలు జరిగాయి.
భారత ప్రభుత్వం ఈ సంఘటనలను పరిశీలించవలసిందిగా కెనడా ప్రభుత్వాన్ని కోరింది.
కెనడాలో 2019 నుంచి 2021 వరకు మతం,జాతి, లైంగిక ధోరణికి వ్యతిరేకంగా ద్వేషపూరిత నేరాలు 72% పెరిగాయి.ఇది మైనారిటీ సంఘాలను, ముఖ్యంగా భారతీయ సమాజాన్ని ఆందోళనకు గురి చేసింది.కాగా కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారందరి పాస్పోర్ట్లను రద్దు చేయాలనే డిమాండ్స్ పెరిగిపోతున్నాయి.
ఇదిలా ఉండగా, కెనడాలో భారతీయ సంఘం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.
కెనడా మొత్తం జనాభాలో దాదాపు 4% మంది భారతీయులే ఉన్నారు.మరోవైపు కెనడాలోని భారతీయ సమాజంపై ఖలిస్థానీ అనుకూల శక్తులు దాడి చేయడం గురించి భారత ప్రభుత్వం మాట్లాడింది.ఖలిస్థాన్ ప్రపంచవ్యాప్తంగా ప్రవాసులపై దాడులు చేస్తూ అందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
ముఖ్యంగా ఆస్ట్రేలియాలో వీరి దాడులు పెరుగుతున్నాయి.