విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది.ఆయన వైసిపి ,జనసేన, బిజెపి ఇలా మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరతారనే ప్రచారం చాలా కాలం పాటు జరిగింది.
దీనికి తగ్గట్లుగానే వైసిపిలో చేరేందుకు గంటా శ్రీనివాసరావు విశ్వ ప్రయత్నాలు చేసినా, వైసిపి అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆగిపోయారు. ఒక దశలో ఆయన జనసేనలో చేరేందుకు ప్రయత్నించారు.
దానికంటే ముందుగా తను అనుచరులను జనసేన లో యాక్టీవ్ చేశారు.కానీ జనసేన అప్పట్లో పెద్దగా ప్రభావం చూపించే స్థాయిలో లేకపోవడంతో, గంట ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
చివరకు స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం మొగ్గు చూపించడం , దానికి సంబంధించిన కసరత్తు మొదలవగానే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.ఇంకా ఆ రాజీనామా లేక స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది.
ఇక టిడిపిలోనూ ఆయన గెలిచిన దగ్గర నుంచి యాక్టివ్ గా లేరు.అయితే ఇటీవల కాలంలో టిడిపి పరిస్థితి మెరుగవ్వడం , జనసేన టిడిపి పొత్తు కుదిరి అవకాశం ఉండడం తదితర అన్నిటిని లెక్కలు వేసుకున్న గంటా శ్రీనివాసరావు ఇప్పుడు టిడిపిలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇటీవలే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు.ఇక అప్పటి నుంచి లోకేష్ తో సన్నిహితంగా ఆయన మెలుగుతున్నారు.తాజాగా విశాఖ టిడిపి కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న గంటా శ్రీనివాసరావు నారా లోకేష్ ప్రారంభిస్తున్న యువగళం పాదయాత్ర సెన్సేషనల్ హిట్ అవుతుందంటూ మాట్లాడారు. లోకేష్ పాదయాత్ర ఈనెల 27 నుంచి ప్రారంభమవుతుందని , 400 రోజులు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారని గంటానే తెలిపారు.

అంతే కాదు లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని తామంతా కోరుకుంటున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.అయితే ఇటీవల లోకేష్ తో జరిగిన చర్చల తరువాత గంటా లోకేష్ టీమ్ లో చేరినట్లుగా అర్థమవుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో గంటా శ్రీనివాసరావుకు గట్టిపట్టు ఉండడం, కాపు సామాజిక వర్గంలోనూ ఆయన కీలక నేత కావడంతో టిడిపి సైతం ఆయన విషయంలో సానుకూలంగానే ఉంది.పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రాంతంలో సక్సెస్ చేసే బాధ్యతలను గంటకు అప్పగించినట్లు సమాచారం.
లోకేష్ తో సానిహిత్యం పెంచుకుంటేనే రాబోయే రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి డోకా ఉండదు అనే అభిప్రాయం తో ఆయన ఉన్నారట.







