ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీతో ఉన్నారు .2024 ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పవన్ వ్యూహాలు రచిస్తున్నారు.అందుకే తన పంతాలు ,పట్టింపులు అన్నిటినీ పక్కనపెట్టి తెలుగుదేశం పార్టీని సైతం కలుపుకుని వెళ్లేందుకు పవన్ సిద్దమయ్యారు.మొదటి నుంచి టిడిపి ,జనసేనలు పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం జరిగినా, పవన్ మాత్రం ఈ విషయంలో ఎక్కడ స్పందించలేదు .బిజెపితో జనసేన పొత్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో పవన్ టిడిపి తో పొత్తు పెట్టుకునే ఆలోచనను గోప్యంగానే ఉంచారు.అయితే మొదటి నుంచి బిజెపితో సఖ్యత లేకపోవడం , ఏపీ బీజేపీ నాయకులు సైతం పవన్ ను పట్టించుకోనట్టుగానే వ్యవహరించడం, రెండు పార్టీలు విడివిడిగానే కార్యక్రమాలు , సభలు, సమావేశాలు నిర్వహిస్తుండడం వంటివి చోటుచేసుకుంటున్నాయి.

ఇక గత కొంతకాలంగా బిజెపి ఏపీ నాయకుల వ్యవహార శైలిపై పవన్ సీరియస్ గానే ఉన్నారు.ఆ పార్టీతో పొత్తు తెగ తెంపులు చేసుకోకపోయినా , టిడిపి విషయంలో ఆయన క్లారిటీతో ఉండడంతో పాటు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అంటూ ప్రకటించి టిడిపితో పొత్తు అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.ఇక నిన్న శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సభలో పవన్ అనేక అంశాలను ప్రస్తావించారు.
దశాబ్దం నుంచి రాజకీయాలు చేస్తున్నానని, ఓట్లు మాత్రం ఈసారి చిలనివ్వను అంటూ ప్రకటించారు.
ఒక్కోసారి నచ్చిన వారిని, నచ్చని వారిని కూడా కలుపుకుని పోవాలని, గౌరవం తగ్గకుండా, లొంగిపోకుండా కుదిరితే పొత్తు పెట్టుకుంటామని, లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తానని పవన్ క్లారిటీ ఇచ్చారు .అంతేకాదు పవన్ తన అభిమానులను జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ఏ రోజైనా మీ గౌరవాన్ని తగ్గించానా చెప్పండి అంటూ ప్రశ్నించారు.రాజకీయమంతా మూడు కులాల చుట్టూ తిరుగుతోందని, రెడ్డి ,కమ్మ ,కాపులు చుట్టే ఎందుకంటూ ప్రశ్నించారు.

ఈసారి వారాహి తో వస్తానని ఎవరు ఆపుతారో చూస్తాను అంటూ వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.అంతేకాదు ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబుతో భేటీ అయిన అంశాన్ని పవన్ ప్రస్తావించారు.దీనిపై కొంతమంది వైసీపీ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని , తాను పరామర్స కోసమే ఆయనను కలిశానని , తాను బేరాలుడే వ్యక్తిని కాదని , పాతిక కోట్లు టాక్స్ కట్టేవాడినని పవన్ ఆవేశంగా ప్రసంగించారు.
విశాఖలో తనకు జరిగిన ఘటనపై చంద్రబాబు తనకు మద్దతు తెలిపారని, అందుకే ఆయనను కలవలసి వచ్చింది అన్నారు. సంబరాల రాంబాబు గురించి 22 నిమిషాలు, సన్నాసి ఐటి మినిస్టర్ గురించి 18 నిమిషాలు , శాంతి భద్రతలపై అరగంటసేపు మాట్లాడమని క్లారిటీ ఇచ్చారు .గతంలో టిడిపిని తిట్టినా ఇప్పుడు సర్దుకుపోక తప్పదని, వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీల కుడదనే సీట్ల గురించి తాను చంద్రబాబుతో మాట్లాడలేదని , వ్యూహం ఉండాలని ఒంటరిగా వెళ్లి వీరమరణం అవసరం లేదని , ఒంటరిగా పోటీ చేస్తే మీరు తనకు మద్దతు ఇస్తారా అంటూ ప్రశ్నించారు.మొత్తంగా పవన్ తన ప్రసంగంలో టిడిపితో కలిసి నడవబోతున్నామనే విషయాన్ని స్పష్టంగానే ప్రకటించారు.
ఇప్పటి వరకు టిడిపి, జనసేన పొత్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, వాటన్నిటికీ పవన్ క్లారిటీ ఇచ్చేశారు .సీట్ల సర్దుబాటు అంశమే ఇక మిగిలి ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.అయితే బిజెపి తో కలిసి నడుస్తారా పొత్తు తెగ తెంపులు చేసుకుంటారా అనేది క్లారిటీ లేనప్పటికీ, టిడిపి, జనసేన మాత్రం అధికారికంగా పొత్తును ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి.







