బిజెపి ఏపీ మాజీ అధ్యక్షుడు సీనియర్ పొలిటిషన్ కన్నా లక్ష్మీనారాయణ త్వరలోనే జనసేనలో చేరబోతున్నట్లుగా హడావుడి అయితే ప్రస్తుతం జరుగుతోంది.ప్రస్తుతం బిజెపిలో కన్నాకు ఎదురు గాలి వీస్తోంది.
ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కన్నా పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.ఎక్కడికక్కడ ఆయనను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి పొత్తు పెట్టుకుంటాయనే నమ్మకంతో ఉన్న లక్ష్మీనారాయణ జనసేనలో చేరితే రాజకీయంగా తన భవిష్యత్తుకు ఎటువంటి డొఖా ఉండదనే లెక్కలు వేసుకుంటున్నారు.అందుకే పార్టీ మారేందుకు ఆయన సిద్ధమవుతున్నారట.
తాను బిజెపిలో ఉన్నా, తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని, సోము వీర్రాజు తనకు ఎక్కడా ప్రాధాన్య దక్కకుండా చేస్తున్నారనే అసంతృప్తి కన్నా లక్ష్మీనారాయణ లో స్పష్టంగా కనిపిస్తోంది.అంతే కాకుండా ఈ మధ్యకాలంలో జనసేన బాగా బలం పుంజుకోవడం, ప్రస్తుత ఏపీ అధికార పార్టీ వైసీపీ పైన జనాల్లో అసంతృప్తి పెరగడం ఇవన్నీ జనసేనకు కలిసొస్తాయనే లెక్కల్లో ఆయన ఆ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట.
ఇదిలా ఉంటే ఆయన జనసేనలో చేరితే ఆయనకు వ్యక్తిగతంగా లాభం తప్ప, తమ పార్టీకి కలిసి వచ్చేది ఏమిటనే లెక్కల్లో జనసేన నాయకులు ఉన్నారట.కన్న రాజకీయంగా సీనియర్ నేత.అయిన రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నా… కాపు సామాజిక వర్గంలో కదలిక తీసుకువచ్చే స్థాయిలో ఆయన లేకపోవడం తో పెదవి విరుస్తున్నారట.అలా అని కన్నా వెంట సీనియర్ నాయకులు , మాజీ ఎమ్మెల్యేలు వంటి వారు వస్తారా అంటే ఆ ఛాన్స్ కూడా కనిపించడం లేదని, ఇక కన్నా ను చేర్చుకున్న పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయం జనసేన వర్గాల్లో ఉందట.
అయితే కన్నా అనుచరులు మాత్రం తమ నాయకుడు జనసేనలో చేరితే భారీగా చేరికలు ఉంటాయని, గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని, రాజకీయంగా తప్పకుండా మార్పు కనిపిస్తుందని చెప్తున్నారట.అయితే ప్రస్తుతం నాయకుల కొరతతో ఇబ్బందులు పడుతున్న జనసేనకు కన్నా వంటి సీనియర్ తోడైతే రాజకీయ వ్యూహాలు అందించడంలో తగిన సలహాలు ఇస్తారని , ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని జనసేన లోని మరో వర్గం నాయకులు చర్చించుకుంటున్నారట.