ఇకపై ఏపీలో రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్డు షోలు అంటూ రాజకీయ పార్టీలు హంగామా సృష్టించడానికి అవకాశం లేదు.జాతీయ, రాష్ట్ర, మున్సిపల్ , పంచాయతీరాజ్ రహదారుల పైన, మార్జిన్లలో సభలు , ర్యాలీలు నిర్వహించేందుకు అవకాశం లేకుండా హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది.1861 పోలీస్ చట్టం ప్రకారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.రోడ్లపై ఇష్టానుసారంగా బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ ఉండడం, ప్రజలు అసౌకర్యానికి గురవడంతో పాటు, వాటి నిర్వహణలో ఏర్పడుతున్న లోటుపాట్లు కారణం గా ప్రజల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో చోటు చేసుకోవడంతో, 30 పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తూ కీలక నిర్ణయం వెలువడింది.
ఏపీలో జాతీయ రాష్ట్ర మున్సిపల్ పంచాయతీరాజ్ రహదారులు పూర్తిగా ప్రజల రాకపోకలు, సరుకు రవాణా కోసమే ఉపయోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.
గ్రామాలు , పట్టణాలు, నగరాల్లో సభల నిర్వహణకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం జిల్లాల ఉన్నతాధికారులకు సూచనలు చేసింది.
రాజకీయ పార్టీలు సభలు, ర్యాలీలు అన్ని రహదారులకు దూరంగా సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సరైన ప్రదేశాలను ఎంపిక చేయాలని పేర్కొంది.అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సంతృప్తి చెందితే షరతులతో సభలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వొచ్చని, దీనికి ముందుగానే వాటి నిర్వాహకులు లిఖితపూర్వకంగా అనుమతి తీసుకోవాలని, సభను ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు ? ఎంత సమయం నిర్వహిస్తారు ? అనే ఖచ్చితమైన రూట్ మ్యాప్ తో పాటు, సభకు హాజరయ్యే వారి సంఖ్య, వాటి నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలి.

వాటిపై జిల్లా ఎస్పీ లేదా పోలీస్ కమిషనర్ సంతృప్తి చెందితే నిర్వాహకుల పేరుతో షరతులతో వాటికి అనుమతిస్తారు.అనుమతి మేరకు సభలు నిర్వహించాల్సి ఉంటుంది .వాటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.కొద్దిరోజుల క్రితమే నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్డుపై టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుని ఎనిమిది మంది టిడిపి కార్యకర్తలు మృతి చెందారు.
అలాగే గుంటూరు జిల్లాలో టిడిపి నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో ముగ్గురు మహిళలు మరణించారు.దీంతో ముందు ముందు ఈ తరహా సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలలో భాగంగా ఈ నిబంధనలను రూపొందించారు.