తెలంగాణలో బిజెపిని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆ పార్టీ అధిష్టానం పెద్దలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు .ఈ మేరకు తెలంగాణ బిజెపి నాయకులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా తెలంగాణ ప్రజల్లో బిజెపికి ఆదరణ పెరిగేలా చేస్తున్నారు.అంతేకాకుండా కేంద్ర మంత్రులు , బిజెపి కీలక నాయకులంతా తెలంగాణలో పర్యటిస్తూ .టిఆర్ఎస్ కాంగ్రెస్ లపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.తాజాగా తెలంగాణలో రథయాత్రలకు బిజెపి శ్రీకారం చుట్టనుంది.
వచ్చే ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ముందస్తుగా ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగాను బిజెపి సిద్దమవుతుంది.
ఈ నేపథ్యంలోనే వచ్చే నెల జనవరి నుంచి వివిధ రూపాల్లో పార్టీ కార్యక్రమాలను ఉదృతం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
జనవరి 15 లేదా 16వ తేదీ నుంచి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు చొప్పున పర్యటనలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.దాదాపు రెండు వారాల్లో ఈ పర్యటనలు ముగిసే విధంగా ఫిబ్రవరి మొదటి , రెండు వారాల్లో తెలంగాణ అంతట రథయాత్రలు చేయించాలని బిజెపి అధిష్టానం నిర్ణయించుకుంది.
తెలంగాణ మొత్తం ఒకేసారి కవర్ చేసే విధంగా అన్ని వైపులా రథయాత్రలు నిర్వహించే ఆలోచనలో ఉందట.ఈ యాత్ర షెడ్యూల్ రూట్ మ్యాప్ లపై సమగ్రంగా చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఈ మేరకు తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం.వాస్తవంగా జనవరిలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల పరిధిలో 16 నుంచి 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర చేపట్టాలని సంజయ్ భావించారు.అయితే దీనికి ఎక్కువ సమయం పట్టడం, సమయం తక్కువగా ఉండడంతో ఈ రథ యాత్రలకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది.







