రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా తాము, తమ పార్టీ అధికారంలోకి రావాలంటే పాదయాత్ర చేయడం ఒక్కటే మార్గమని భావిస్తున్న ఆయా పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు పాదయాత్రను చేపడుతున్నారు.తెలంగాణ విషయానికొస్తే ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహిస్తున్నారు.
ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సైతం పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతూ వస్తున్నారు.అలాగే,బీఎస్పి తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం పాదయాత్రను చేపట్టారు.
ఇక ఎన్నికల సమయం నాటికి మరింతగా జనాల్లోకి వెళ్ళేందుకు మిగతా పార్టీల నాయకులు పాదయాత్ర చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే హడావుడి జరుగుతున్న నేపథ్యంలో, ఇప్పటికిప్పుడు పాదయాత్ర ద్వారా తెలంగాణలోని అన్ని ప్రాంతాలలోనూ యాత్రను చేపట్టడం సాధ్యం కాదనే అభిప్రాయానికి ప్రధాన పార్టీల అధినేతలు రావడంతోనే , ఇప్పుడు పాదయాత్ర స్థానంలో బస్సు యాత్రను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రను వీలైనంత తొందరగా ముగించి, బస్సు యాత్ర చేపట్టాల్సిందిగా బిజెపి అధిష్టానం ఆదేశించడంతో వచ్చే నెల నుంచి ఆయన బస్సు యాత్రను చేపట్టేందుకు వ్యూహాలను రచించుకుంటున్నారు.ఇక వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల సైతం పాదయాత్రకు ముగింపు పలికి బస్సు యాత్ర చేపట్టి ,తెలంగాణ అంతట విస్తృతంగా పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
అలాగే కాంగ్రెస్ సైతం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో ముందుగా నిర్ణయించుకున్న పాదయాత్ర స్థానంలో బస్సు యాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఇక తెలంగాణలో పెద్దగా కార్యకలాపాలు ఏమి లేకపోయినా, రాబోయే ఎన్నికల్లో తాము 34 స్థానాలు పోటీ చేస్తామంటూ ప్రకటించిన జనసేన బస్సు యాత్రకు సిద్ధమవుతోంది.ఏపీ ఎన్నికల కంటే ముందుగా తెలంగాణలో ఎన్నికలు రాబోతున్న క్రమంలో, తెలంగాణలో తాము పోటీ చేయాలని భావిస్తూ, నియోజకవర్గాలకు పవన్ పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే పవన్ ప్రచార రథం ‘వారాహి ‘ కూడా అన్ని అనుమతులతో సిద్ధం కావడంతో పవన్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి.
ఇదే విధంగా మిగతా చిన్న పార్టీలు సైతం బస్సు యాత్రలను చేపట్టే ప్లాన్ తో ఉన్నాయట.