మొత్తానికి కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కల నెరవేరింది.టిఆర్ఎస్ పార్టీ పేరుతో తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీని స్థాపించి, తెలంగాణ సాధించేవరకు వదిలిపెట్టకుండా కేసీఆర్ పోరాడారు.
రెండుసార్లు తెలంగాణలో టిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు.జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పేందుకు భారత్ రాష్ట్ర సమితి పేరుతో పార్టీని స్థాపించారు .అక్టోబర్ 5 న టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్ లేఖ రాశారు.ఈసీ సూచన మేరకు పార్టీ పేరుపై ఎటువంటి అభ్యంతరాలు అయినా ఉంటే 30 రోజుల్లో చెప్పాలంటూ పబ్లిక్ నోటీసును ఇచ్చారు.
గడువు ముగిసినా, ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో, తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా గుర్తిస్తున్నట్లు అధికారికంగా ఎన్నికల కమిషన్ లేఖ రాసింది .త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని తెలిపింది.బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు అన్ని అడ్డంకులు తొలగడంతో, ఈరోజు మధ్యాహ్నం 1.20 నిమిషాలకు కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలోనే బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు.ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎంపీలు, జిల్లా అధ్యక్షులకు ఈ జెండా ఆవిష్కరణ కు రావాల్సిందిగా ఆహ్వానం అందించారు.
పార్టీ నాయకులు మధ్య అట్టహాసంగా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కెసిఆర్ నిర్వహించబోతున్నారు .ఇక ఈ జెండా రూపకల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు .గులాబీ జెండా మధ్యలో భారతదేశం మ్యాప్ ఉంటుంది.పార్టీ పేరు , జెండా మారినప్పటికీ కారు గుర్తును మాత్రం కొనసాగించబోతున్నారు.
ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు.కేసీఆర్ తో పాటు, 283 మంది ప్రతినిధులు ఈ తీర్మానాలపై సంతకాలు చేశారు.21 ఏళ్ల పాటు సాగిన టిఆర్ఎస్ ప్రస్థానం ఇప్పుడు బీఆర్ఎస్ లో విలీనం అవుతోంది.కొత్త జాతీయ పార్టీతో చురుగ్గా జాతీయ రాజకీయాల్లో ఫోకస్ పెట్టి, దేశ వ్యాప్తంగా కీలకం అయ్యేందుకు బిజెపి వ్యతిరేక కూటమిని తెరపైకి తెచ్చేందుకు కేసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగా బీఆర్ఎస్ కు బీజం పడింది.
.