కేంద్ర అధికార పార్టీ బిజెపికి ఏపీలో అధికారం లేకపోయినా, కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఏపీ రాజకీయాన్ని శాసిస్తోంది .అధికార పార్టీ వైసీపీ తో పాటు టిడిపి, జనసేన రాజకీయాలను శాసిస్తోంది.
బిజెపి ఎన్ని విమర్శలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా, ఆ పార్టీ పైన బిజెపి పెద్దల పైన విమర్శలు చేసే సాహసం ఏపీలోని ఏ పార్టీ నాయకులు చేయలేకపోతున్నారు.దీనికి కారణం రానున్న రోజుల్లో బిజెపి సహకారం కావాల్సి ఉండడమే.
కేంద్రంతో విరోధం పెట్టుకోవడం వల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉండడంతో, వైసీపీతో సహా అన్ని పార్టీలు కేంద్రం గుప్పట్లోనే ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి.ప్రస్తుతం ఏపీలో 2024 ఎన్నికలకు సంబంధించిన హడావుడినే నడుస్తోంది.
ఎన్నికలు వైసీపీ, టీడీపీ ,జనసేన పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం.అయితే ఇప్పుడు ఈ మూడు పార్టీలను తన కనుసన్నల్లో నడిపించే ప్రయత్నం బిజెపి అగ్ర నేతలైన ప్రధాని నరేంద్ర మోది, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో ఏపీలో టిడిపి ఘోరంగా ఓటమి చెందడానికి కారణం పరోక్షంగా బిజెపి పెద్దలే తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం తో పాటు, వైసిపికి అన్ని రకాలుగా సహకరించడంతో టిడిపి ఘోరంగా ఓటమి చెందింది.అయితే అప్పటి నుంచి బిజెపితో పొత్తు కోసం బాబు ఇప్పటికీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
అయినా, బిజెపి పెద్దలు మాత్రం టిడిపితో పొత్తుకు అంగీకరించడం లేదు.పొత్తు లేకపోయినా ఈడి, ఐటి దాడులు చేపట్టకుండా ఉంటే చాలు అన్నట్లుగా చంద్రబాబు బిజెపి అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.
ఇక బిజెపి పెద్దల సహకారంతో ఎన్నికల్లో గట్టెక్కితే చాలు అన్న ఆలోచనతో వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ ఉన్నారు.అందుకే కేంద్రం అడిగినా, అడగకపోయినా అన్ని విషయాల్లో మద్దతు పలుకుతూ బిజెపి పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో జగన్ ఉంటున్నారు .వైసిపి విషయంలో కేంద్రం వైఖరి ఏ విధంగా ఉందనేది స్పష్టం కానప్పటికీ, జగన్ కేంద్రం చెప్పు చేతల్లో ఉన్నారనే విషయం అర్థం అవుతోంది.
జనసేన విషయానికి వస్తే , బిజెపితో పొత్తు రద్దు చేసుకుని టిడిపి తో జాతకట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా సంకేతాలు వచ్చిన వెంటనే… విశాఖకు వచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోది పవన్ ను పిలిపించుకుని అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చారు.ఆ సమావేశం ముగిసిన తర్వాత పవన్ వైఖరిలోనూ మార్పు వచ్చింది టిడిపికి ఆయన దూరంగానే ఉంటున్నారు.కేంద్ర అధికార పార్టీగా ఉన్న బిజెపితో పెట్టుకుంటే 2019 ఎన్నికల్లో టిడిపికి పట్టిన గతే తమకు పడుతుందని భయం వైసీపీతో సహా అన్ని పార్టీలకు ఉంది.
అందుకే ఏ విషయంలోనూ కేంద్రాన్ని ప్రశ్నించే సాహసం ఎవరు చేయలేకపోతున్నారు.ఇక పూర్తిగా చంద్రబాబును కేంద్ర బీజేపీ పెద్దలు పక్కన పెట్టకుండా.అంటి మట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.ఇటీవల జి20 సమావేశాలకు రావాలంటూ ఆహ్వానాలు పంపించారు.
దీంతో కేంద్రం వైకిల్ ఏమిటో ఎవరికి అంతు పట్టడం లేదు.అన్ని పార్టీలను తమ రాజకీయ చట్రంలో బిజెపి అగ్ర నేతలు ఇరికించేసినట్టుగానే పరిస్థితి కనిపిస్తోంది.
.