ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి.ఈ వ్యవహారంలో తెలంగాణ సీఎం కుమార్తె ,ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి రావడం పెద్ద సంచలనం సృష్టించగా, ఇప్పుడు ఆ కేసులోనే ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
దీనికి తగ్గట్లుగానే ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో సంబంధం ఉందంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తాజాగా సమర్పించిన రిమాండ్ రిపోర్టులో 36 మంది పేర్లను చేర్చారు .ఈ పేర్లలో ఎమ్మెల్సీ కవిత పేరుతో పాటు , ఏపీకి చెందిన ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా ఉంది.ఇప్పటికే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలతో అమిత్ అరోరాను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.ఈ సందర్భంగా సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కవిత , మాగుంట శ్రీనివాస్ రెడ్డి పేర్లు ఉన్నాయి.
అయితే ఈ వ్యవహారంలో మాగుంట కంటే కవిత వ్యవహారాన్ని ఈడి అధికారులు ఎక్కువగా దర్యాప్తు చేస్తుండడంతో, కవితను విచారణకు పిలిపించిన ఈడి అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా హడావుడి నడుస్తోంది. ఇప్పటికే తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు సన్నిహితుడుగా ముద్రపడిన మంత్రి మల్లారెడ్డి ఆస్తులు, వ్యాపార వ్యవహారాలపై సిబిఐ , ఈడి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
అలాగే మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలను సిబిఐ విచారిస్తోంది.ఇదిల ఉండగానే టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిజెపి నేతల పాత్రను తేల్చినందుకు సిట్ దర్యాప్తు బృందాన్ని కేసీఆర్ నియమించారు.
దీంతో సిట్ అధికారులు వేగం పెంచారు.ఇప్పటికే బిజెపి కీలక నేతగా నరేంద్ర మోది, అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన బిఎల్ సంతోష్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత వ్యవహారంపై కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తుండడం తో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం లో సిట్ దర్యాప్తును వేగవంతం చేసి, కవిత విషయంలో బిజెపి వెనక్కి తగ్గేలా చేసేందుకు కేసిఆర్ ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

అయితే బిజెపి పెద్దలు కూడా కేవలం కవితకు అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉందని నిరూపించేందుకు , జనాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందనే విషయాన్ని తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టుగానే కనిపిస్తోంది.ఒకవేళ ఈ వ్యవహారంలో కవితను అరెస్టు చేస్తే , దానిని కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకుని సెంటిమెంటును మరింత రగుల్చుతారు అని, ఇది ఎన్నికల సమయంలో తమకు ఇబ్బందిగా మారుతుందనే లెక్కల్లో ఉన్నారట.అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవిత పేరును బయటకు తీసి , టీఆర్ఎస్ అవినీతిని హైలెట్ చేయడమే తప్ప కవితను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేసే అవకాశాలు ఉండవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.







