ఏపీ రాజకీయాల్లో తన సత్తా చాటుకోవాలని, జనసేన ను అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పరిస్థితులు ఇప్పుడు కాస్త అనుకూలంగా మారాయి.ఏపీ అధికార పార్టీగా ఉన్న వైసిపి పై జనాల్లో కొంచెం కొంచెంగా పెరుగుతున్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో స్థానాలు దక్కకపోయినా, కింగ్ మేకర్ అవుతానని పవన్ భావిస్తున్నారు.
ఎలాగు బిజెపి తమతో పొత్తులో ఉంది కనుక, కేంద్ర బిజెపి పెద్దల సహకారంతో తాను ముఖ్యమంత్రి అవుతానని నమ్మకంతో పవన్ ఉన్నారు. అందుకే బీజేపీ సూచనలు మేరకు టిడిపిని ప్రస్తుతానికి దూరంగానే ఉంచారు.
తమతో పొత్తు కోసం టిడిపి ప్రయత్నిస్తున్న, పవన్ మాత్రం ఎన్నికల వరకు ఏ విషయాన్ని తేల్చేలా కనిపించడం లేదు.ఇక అమరావతి రాజధానిగా ఉంచాలని మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని గత కొద్ది రోజులుగా టిడిపి తో పాటు, జనసేన విడిగా పోరాటం చేస్తోంది .దీని కారణంగా ఉత్తరాంధ్ర , రాయలసీమ ప్రాంతాల్లో తమపై వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.అందుకే రేపటి నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతమైన విజయనగరం జిల్లాలో పర్యటించేందుకు, అక్కడ వినూత్న కార్యక్రమాలు చేపట్టేందుకు పవన్ సిద్ధమవుతున్నారు.
విజయనగరం జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై జనసేన పోరాటం చేస్తుందని పవన్ ప్రకటించారు.విజయనగరం జిల్లాలో గిరిజన విద్య మిథ్య గా మారిందంటూ పవన్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఇక్కడ ప్రజలకు మంచి చేయాలని దూరదృష్టి ప్రభుత్వాలకు లేకపోవడం వల్లే విజయనగరం జిల్లా అన్ని రంగాల్లోనూ వెనకబడిందని , సమస్యలు చుట్టుముట్టాయని పవన్ విమర్శించారు.ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా ఈనెల 22వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహిస్తామని పవన్ ప్రకటించారు.అలాగే నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులతో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చర్చిస్తారని పవన్ ప్రకటించారు.ఈ జిల్లాలో ఉపాధి కరవై పేదరికం, అనారోగ్యం ఇలా ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి అని పవన్ విమర్శించారు.
జనసేన ప్రభుత్వం ఏర్పడగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని పవన్ హామీ ఇచ్చారు.పవన్ వ్యూహాత్మకంగానే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తమ పార్టీపై వ్యతిరేకత పెరగకుండా ఈ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా అర్థమవుతోంది.