మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని ధీమా తో ఉంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం చెందింది.టిఆర్ఎస్, బిజెపిల కంటే తక్కువ ఓట్లను సాధించింది.ఇది ఒక రకంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇది ఎదురు దెబ్బే.2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ బిజెపిలకు ధీటుగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తామంటూ చెబుతూ వస్తున్న రేవంత్ రెడ్డి ఆశలపై మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు నీళ్ళు చిమ్మాయి.అయినా రేవంత్ రెడ్డి మాత్రం చాలా ఆనందంతో ఉన్నారు.దీనికి కారణం మొన్నటివరకు తెలంగాణలో తనకు అన్ని విషయాలలోను అడ్డంకిగా మారుతూ , తనపై పదే పదే అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ, ప్రతి విషయంలోనూ తనకు అడ్డం పడుతూ వస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల ను కాంగ్రెస్ అధిష్టానం పక్కనపెట్టి తనకు అన్ని విషయాల్లోనూ ప్రాధాన్యం ఇస్తుండడం రేవంత్ కు ఆనందం కలిగిస్తుంది.
ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సీనియర్లు చాలామంది దూరంగా ఉండడంతో, సీనియర్లపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు నమ్మకం తగ్గిందని , పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విషయంపై కంటే తమ ప్రాధాన్యం , పంతాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారనే విషయం కాంగ్రెస్ అధిష్టానం గుర్తించడంతో, రేవంత్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందట.ముఖ్యంగా తనకు ప్రతి విషయంలోనూ అడ్డం పడుతూ, తనపై విమర్శలు చేస్తూ అధిష్టానం వద్ద ఫిర్యాదులు చేస్తూ వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ తలనొప్పి తగ్గడంపై రేవంత్ ఆనందంగా ఉన్నారట.
రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరిపోవడం, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున భవనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారానికి రాకపోవడం , కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించడం ఇవన్నీ ఆయన పరపతిని అధిష్టానం పెద్దల వద్ద తగ్గించాయి.

ఇక రానున్న రోజుల్లోనూ వెంకటరెడ్డి తో పాటు, కాంగ్రెస్ సీనియర్లకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చే విధంగా అధిష్టానం కనిపించకపోవడం వంటివి రేవంత్ వర్గీలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.వాస్తవంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం ఎవరికి ఇష్టం లేదు .ఇదే విషయంపై అధిష్టానం పెద్దలు వద్ద తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు.అయినా ఆయనకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.అప్పటి నుంచి వరుసగా రేవంత్ పై ఫిర్యాదులు చేయడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్లు ప్రయత్నిస్తూ, చాలా విషయాల్లో రేవంత్ దూకుడుకు బ్రేకులు వేయగలిగారు.
అయితే ఇకపై ఆ తరహా పరిస్థితులు లేకపోవడంతో, తాను స్వాతంత్రంగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడిందని రేవంత్ తన సన్నిహితులు వద్ద సంతోషం వ్యక్తం చేస్తున్నారట.







