ఒడిశాలో ఒక వింత ఘటన వెలుగు చూసింది.ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని ఒక గ్రామంలో ప్రజలు ఇప్పపూలను నీటిలో పులియబెట్టారు.
ఈ నీటిని కొన్ని ఏనుగులు కడుపునిండా గటగటా తాగేసాయి.ఆపై ఆదమరిచి నిద్రపోయాయి.
మధుక ఇండికా, మహువా, విప్ప ఇలా చాలా పేర్లున్న ఇప్పపువ్వులను గిరిజనులు పులియపెట్టి నాటుసారా తయారు చేస్తుంటారు.అయితే ఈ మద్యాన్నే గజరాజుల గుంపు పూర్తిగా తాగేసింది.
ఆ తర్వాత మత్తుతో తూలుతూ కింద పడుతూ లేస్తూ చివరికి గాఢ నిద్రలోకి జారుకున్నాయి.
కుండలలో ఉంచిన పులియబెట్టిన నీటిని ఏనుగుల గుంపు తాగేసినట్టు తెలిసిన తర్వాత గ్రామస్తులు షాక్ అయ్యారు.
వారు అడవిలో ఒకచోట నాటు సారా తయారు చేయడానికి కుండల్లో ఈ నీటిని పులియబెట్టారు.తిరిగి ఉదయం అక్కడికి వెళ్లి చూడగా కుండలన్నీ పగలడం, పులిసిన నీరు ఖాళీ కావడం కనిపించింది.
చివరికి ఏనుగుల గుంపు పులియబెట్టిన నీటిని సేవించి గాఢ నిద్రలోకి వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలుసుకున్నారు.
దాదాపు 24 ఏనుగులు పులియబెట్టిన నీటిని తాగాయని, అవి గంటల తరబడి నిద్రలోనే ఉన్నట్టు వారు అర్థం చేసుకున్నారు.
కియోంఝర్ జిల్లాలోని శిలిపాడ జీడిపప్పు తోటల సమీపంలో నివసించే గ్రామస్తులు చాలా తయారు చేయాలనుకున్నారు.

‘మేం ఉదయం 6 గంటల ప్రాంతంలో మహువా సిద్ధం చేయడానికి అడవిలోకి వెళ్లాం.అక్కడ కుండలన్నీ పగిలిపోయి ఉన్నాయి.పులియబెట్టిన నీరు కనిపించలేదు.
ఏనుగులు నిద్రపోతున్నట్లు కూడా మేం తెలుసుకున్నాం.దాంతో అవి సారాని తాగాయని అర్థం చేసుకున్నాం’ అనే ఒక గ్రామస్తుడు చెప్పాడు.
ఆ తర్వాత వాటిని లేపడానికి వీరు ప్రయత్నించారట కానీ అవి మొద్దు నిద్రలో ఉండడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.అటవీ శాఖ అధికారులు మందను నిద్ర లేపేందుకు డప్పులు కొట్టాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఏనుగులు నిద్రలేచి అడవిలోకి వెళ్లాయని అటవీశాఖ అధికారి ఘాసిరామ్ తెలిపారు.







