మీరు ఎప్పుడైనా జిటిఏ గేమ్ ఆడారా? కనీసం జిటిఏ గేమ్ప్లే అయినా చూశారా.ఈ గేమ్లో ఒక క్యారెక్టర్ రోడ్లమీద ఆగి ఉన్న కార్ల డ్రైవర్లను తుపాకీతో బెదిరించి వారి కారుని ఎత్తుకెళ్తాడు.
అయితే అచ్చం ఇలాంటి సీన్యే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తుపాకీతో ఒకరిని బెదిరించి వారి ఫార్చ్యూనర్ ఎస్యూవీని ఎంచక్కా ఎత్తుకెళ్లారు.
ఢిల్లీ కంటోన్మెంట్ సమీపంలోని జాతీయ రహదారి-8పై శుక్రవారం నాడు ఈ షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.ఈ లూటీకి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి.
వైరల్ వీడియోలో సాయుధ దుండగులు గన్ను చూపించి అతని ఫార్చ్యూనర్ కారును దోచుకుని పారిపోతున్నట్లు కనిపించింది.వీడియోలో మొదటగా ముగ్గురు వ్యక్తులు బైక్ నడుపుతూ కనిపించారు.ఎస్యూవీ రోడ్డుపై ఆగినప్పుడు, ముగ్గురిలో ఒకరు డ్రైవర్ వైపుకు వచ్చారు.డ్రైవరు బయటకు రాగానే, ఒక వ్యక్తి జేబులోంచి గన్ తీసి బెదిరించాడు.
మరో దుండగుడు కూడా తుపాకీ కాలుస్తూ భయపెట్టాడు.మూడవ నిందితుడు వారితో చేరాడు.
ఈ ముగ్గురూ బైక్ను వదిలి ఎస్యూవీలో అక్కడి నుండి పారిపోయారు.
బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తుపాకీతో టయోటా ఫార్చ్యూనర్ను దోచుకున్నారని పోలీసులు ఆదివారం తెలిపారు.
సీనియర్ పోలీసు అధికారి ప్రకారం, అక్టోబర్ 29న NH-8 నుంచి కారు లూటీ గురించి ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందింది.ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వచ్చి తుపాకీలు చూపించి తన టయోటా ఫార్చ్యూనర్ను దోచుకున్నారని ఉత్తరప్రదేశ్లోని మీరట్ సమీపంలోని బాదం గ్రామానికి చెందిన 35 ఏళ్ల రాహుల్ అనే ఫిర్యాదుదారు పోలీసులకు తెలిపాడు.
అతని ఫిర్యాదు మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సీసీటీవీలో కనిపించిన దృశ్యాలు ఆధారంగా వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.