అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్కు ప్రధానిగా భారత మూలాలున్న రిషి సునాక్ ఎన్నికవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వున్న భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.200 సంవత్సరాలు పాటు భారతదేశాన్ని పాలించిన బ్రిటన్ను ఒక భారత సంతతి బిడ్డ ఏలనుండటంతో వారు కొత్త అనుభూతికి గురవుతున్నారు.ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ పెడుతోన్న పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.మరోవైపు కింగ్ చార్లెస్ IIIని కలిసిన అనంతరం రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఆ వెంటనే జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన, క్షణం కూడా ఆలస్యం చేయకుండా కేబినెట్ కూర్పును ప్రారంభించి సమర్ధులైన వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.
ఇదిలావుండగా… ప్రధాని హోదాలో తొలి మంత్రి మండలి సమావేశానికి రిషి సునాక్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా పలు కీలకాంశాలపై కేబినెట్లో చర్చించినట్లుగా తెలుస్తోంది.దీనిపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ కథనాన్ని ప్రచురించింది.అక్రమ వలసలను సంక్లిష్టమైన , సవాలుతో కూడిన సమస్యగా రిషి సునాక్ తన మంత్రివర్గ సహచరులతో వ్యాఖ్యానించినట్లుగా తన కథనంలో తెలిపింది.గతంలో హోంమంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ కూడా అక్రమ వలసలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా ఆమె సమక్షంలోనే రిషి అక్రమ వలసలపై కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కాగా.బ్రిటన్ హోంమంత్రిగా సుయెల్లా బ్రేవర్మాన్ను రిషి సునాక్ తిరిగి నియమించడం వివాదాస్పదమైంది.గతంలో హోంమంత్రిగా ఆమె పనితీరు, వైఖరి తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
వీసా పరిమితి ముగిసినప్పటికీ భారతీయులు బ్రిటన్ను వీడటం లేదని… మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ (ఎంఎంపీ) ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని బ్రేవర్మాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అలాగే ఇండియా- యూకేల మధ్య చర్చల దశలో వున్న ప్రతిపాదిత స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)పై వీసా సంబంధిత రిజర్వేషన్లపైనా సుయెల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీనిపై భారత్ ధీటుగా బదులిచ్చింది.ఇది ముగిసిన కొన్నాళ్లకే సుయెల్లా బ్రేవర్మాన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.అధికారిక కార్యక్రమం కోసం వ్యక్తిగత ఈమెయిల్ ఇచ్చినందుకు మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు.అయితే ప్రస్తుతం యూకేలో చోటు చేసుకున్న పరిస్ధితుల నేపథ్యంలో రోజులు గడవకముందే సుయెల్లా బ్రేవర్మాన్ మరోసారి బ్రిటన్ హోంమంత్రిగా పగ్గాలు అందుకున్నారు.







