మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి టిఆర్ఎస్ పై మరింతగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్.బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి బండి సంజయ్ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నా… ఇప్పుడు మునుగోడు లో జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మక కావడం, బిజెపి అగ్ర నేతలు ఈ నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలను తన భుజాలపై పెట్టడం తదితర కారణాలతో సంజయ్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు .
టిఆర్ఎస్ మంత్రులతో పాటు , సీఎం కేసీఆర్, కేటీఆర్ వంటి వారిపైన ఘాటు పదజాలంతో విరుచుకుపడుతున్నారు.అయితే సంజయ్ చేస్తున్న విమర్శలు కాస్త శ్రుతి మించితున్నట్టు గా కనిపిస్తున్నాయి.
ఈ అంశంపై టిఆర్ఎస్ ఇప్పుడు మండిపడుతుండడమే కాకుండా , దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది .సంజయ్ పై తగిన చర్యలు తీసుకోవాలని, ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని , అసలు మునుగోడు ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఆయనకు అనుమతి నిరాకరించాలని, ఏపీ స్టార్ క్యాంపెనర్ హోదా నుంచి ఆయనను తప్పించాలని టిఆర్ఎస్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
![Telugu @cm_kcr, @electioncommissionofindia, Bandi Sanjay, Congress, Munugodu, Tr Telugu @cm_kcr, @electioncommissionofindia, Bandi Sanjay, Congress, Munugodu, Tr](https://telugustop.com/wp-content/uploads/2022/10/Munugodu-elections-TRS-BJPcongress.jpg )
తాజాగా మునుగోడు నియోజకవర్గంలోని తిరుమండ్లపల్లిలో రోడ్ షో నిర్వహించిన బండి సంజయ్ ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి టిఆర్ఎస్ పార్టీ నోట్లు ఇస్తే తీసుకోవాలని, కానీ ఓటు మాత్రం బిజెపికి వేయాలంటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు.అయితే ఈ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ను ఉల్లంగించడమేనని టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.ఓటర్లు అవినీతికి పాల్పడే విధంగా బండి సంజయ్ ప్రోత్సహిస్తున్నారని, టిఆర్ఎస్ పై విమర్శలు చేసే క్రమంలో దండుపాళ్యం బ్యాచ్ అంటూ అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా టీఆర్ఎస్ ఫిర్యాదులో పేర్కొంది.బిజెపి కార్యకర్తలను రాముడు గాను, టిఆర్ఎస్ కార్యకర్తలను రాక్షసులుగాను అభివర్ణిస్తూ బండి సంజయ్ విమర్శలు చేస్తున్నా… ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడంపై టిఆర్ఎస్ నాయకులు ఆక్షేపిస్తున్నారు.