అగ్ర రాజ్యం అమెరికాలోని ఇల్లినాయిస్ లోని బ్లూమింగ్ టన్ నార్మల్ లో కొలువై ఉన్న సీతా రామచంద్ర స్వామి ఆలయం తెలుగు సంగీత విద్యార్ధుల తీయని గానంతో పులకరించి పోయింది.ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కళ్యాణీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అలాగే దేవాలయ నిర్వాహకుల ఆధ్వర్యములో వైభవోపేతంగా నిర్వహించారు.
దేశం విడిచి విదేశాలకు ఎన్నో కారణాల వలన వెళ్ళినా సరే తమ తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవించుకోవడంలో, భావి తరాలకు అందించడంలో నిర్వాహకుల కృషి అనిర్వచనీయమనే చెప్పాలి.
తెలుగు సంగీత విద్యార్ధులు దాదాపు 108 సంకీర్తనలను అలవోకగా ఎలాంటి బెదురు లేకుండా తటపటాయించకుండా గానం చేయడం ఎంతో అద్భుతమనే చెప్పాలి.
ఉదయం 10 గంటలకు మొదలైన ఈ కార్యక్రమం రాత్రి 8 గంటల వరకూ నిర్విరామంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన కల్యాణి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ వారు తమ విద్యార్ధలను ఏడు గ్రూప్ లుగా విభజించి చక్కనైన ప్రణాళికతో పిల్లలతో సంకీర్తనలు పాడించిన తీరు కార్యక్రమాన్ని తిలకించడానికి విచ్చేసిన వారిని కట్టిపడేసింది.
ఇంతటి మహోన్నతమైన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా జూమ్ లింక్ ద్వారా అవకాశం కల్పించారు.కాగా

అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచీ అంతర్జాలంద్వారా ఎంతో మంది తెలుగు వారు వీక్షించారు. త్యాగరాజు, అన్నమయ్య, పురందర దాసు, శ్యామా శాస్త్రి ఇలా ఎందరో మహాను భావులు రచించిన కీర్తనలను పిల్లలు ఆలపించారు.ఈ కార్యక్రమానికి సుమారు 27 తెలుగు సంగీత విద్యార్ధులు పాల్గొన్నారు.
సంగీతాలాపన చేస్తున్నంత వరకూ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు వారు ఆలయానికి నగదును విరాళాల రూపంలో అందించారు, ఆన్లైన్ లో వీక్షించిన భక్తులు సైతం డబ్బును విరాళాల రూపంలో అందించారు.కార్యక్రమం అనంతరం కార్యక్రమ నిర్వాహకులు విరాళాలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విరాళాలను స్వామి వారి సేవలకు ఉపయోగిస్తామని తెలిపారు.







