కాంగ్రెస్ తెలంగాణ రథసారధిగా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన శక్తికి మించి ప్రయత్నాలు చేస్తున్నారు.ఒకపక్క గ్రూపు రాజకీయాలను తట్టుకుంటూ, ప్రజల్లోకి కాంగ్రెస్ ను తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల తంతు మొదలైపోవడంతో , ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపి టిఆర్ఎస్ లకు ధీటుగా కాంగ్రెస్ ను జనాలకు దగ్గర చేసేందుకు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన ఈ మునుగోడులో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.గత కొద్దిరోజులుగా పూర్తిగా మునుగోడు పైనే దృష్టి సారించారు.
మునుగోడు పైన అనేక రాజకీయ వ్యూహాలు రూపొందించుకుంటూ పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతుండగా, మరోవైపు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలోకి అడుగుపెట్టబోతోంది.ఈ యాత్రను సక్సెస్ చేసే బాధ్యత కూడా రేవంత్ పైనే ఉంది.
రాహుల్ సభకు భారీగా జన సమీకరణ చేయడంతో పాటు, యాత్ర సజావుగా సాగేలా చూసే బాధ్యతలు ఆయన పైనే ఉన్నాయి.సరిగ్గా అదే సమయంలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల తంతు, ఎన్నికల ప్రచారం, రాజకీయ వ్యూహాలు ఇలా ఎన్నో బాధ్యతలు రేవంత్ పై ఉన్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ తరపున మునుగోడులో ఇతర ప్రాంతాల్లోని కీలక నాయకులను మోహరించారు.అయితే రాహుల్ సభ తెలంగాణలో ప్రారంభమైన దగ్గర నుంచి ఆయన దృష్టిలో పడేందుకు తెలంగాణలోని కీలక నాయకులంతా ప్రయత్నాలు చేస్తారు.

మునుగోడు ఎన్నికల అంశాన్ని పక్కన పెట్టు మరీ రాహుల్ యాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు.ఇదే రేవంత్ కు ఇబ్బందికరంగా మారింది.పూర్తిగా నాయకులు మునుగోడు లోనే మకాం వేసే విధంగా చూడడంతో పాటు, తాను సైతం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే రాహుల్ పాదయాత్రలో కీలకంగా వ్యవహరించాల్సి ఉండడం, అలాగే పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టడం, ఇవన్నీ ఇబ్బందికరంగా మారిపోతున్నాయనే టెన్షన్ రేవంత్ లో కనిపిస్తోంది.ఒకపక్క టిఆర్ఎస్ , బిజెపిలు దూకుడుగా ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళుతున్నాయి.
నువ్వా నేనా అన్నట్టుగా ఎన్నికల్లో గెలిచేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఒక వైపు రాహుల్ పాదయాత్ర, మరోవైపు మునుగోడు ఎన్నికలను ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలనే విషయంపైనే ఇప్పుడు రేవంత్ ఎక్కువ కంగారు పడుతున్నారట.







