మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.ప్రధాన పార్టీలన్నీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, ప్రతి ఓటును కీలకంగానే చూస్తున్నారు.
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వారిని తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.ఓటర్ల కోరికలను తీర్చుతూ వారికి అడ్వాన్స్ పేమెంట్ లు చేస్తూ తమవైపే ఉండేలా ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో గెలుపు ప్రతి పార్టీకి అత్యవసరం కావడంతో, సొమ్ములు ఖర్చు చేసేందుకు వెనకాడడం లేదు.ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ పార్టీలోని కీలక నాయకులందరినీ నియోజకవర్గంలో మోహరించి.
ప్రతి వందమంది ఓటర్లకు ఒక ఇన్చార్జి నియమించాయి.వారి ద్వారా ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ విషయంలో టిఆర్ఎస్ , బిజెపి, కాంగ్రెస్ ఒకే విధమైన ఫార్ములాతో వెళ్తున్నాయి.ప్రత్యర్ధి పార్టీలు ఓటర్లకు ఇచ్చే సొమ్ముల కంటే అదనంగా ఇస్తామని ఓటర్లను పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇక తమ పార్టీలో చేరితే ఎంతవరకు మేలు చేకూరుతుందనే విషయాన్ని చెబుతూ, ఇతర పార్టీల్లోని నాయకులను , తటస్తులను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.అలాగే కొంతమందికి భారీ ప్యాకేజీని కూడా ప్రకటిస్తూ పార్టీ కండువాలు కప్పెస్తున్నాయి.
ఇక ఓ ప్రధాన పార్టీ అయితే , ప్రతి వందమంది ఓటర్లకు నియమించిన ఇన్చార్జి ద్వారా, ఓటర్ల పూర్తి వివరాలను తెలుసుకుంటూ వారిలో స్మార్ట్ ఫోన్ వాడే వారి ఫోన్ నెంబర్, అలాగే గూగుల్ పే, ఫోన్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు అణువుగా వారి నెంబర్లను తీసుకుని, పోలింగ్ సమయంలో డిజిటల్ పేమెంట్ ల ద్వారా అందిస్తామని ఓటర్లకు చెబుతున్నారట.ఇక మరో పార్టీ అయితే ఓటర్లకు ముందుగా 2000 చొప్పున అడ్వాన్స్ పేమెంట్లు చేస్తూ , ప్రత్యర్థి పార్టీలు నగదును పంచిన తర్వాత వారి కంటే ఎక్కువగా అందిస్తామని హామీ ఇస్తున్నారట.
ఇక యువ ఓటర్ల ను ఆకర్షించేందుకు గోవా ట్రిప్ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారట పదిమంది యువత కలిసి పార్టీ కండువా కప్పుకుంటే… ఆ బృందం గోవా ట్రిప్ వెళ్లేందుకు అవసరమైన సొమ్ములు అందించేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం.
ఇప్పటికే రెండు గ్రూపులు ఆ విధంగా చేరేందుకు ఒప్పుకోవడంతో… వారు గోవా వెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేశారట.ఇక పార్టీలో గతంలో యాక్టివ్ గా ఉంటూ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయినవారు, ప్రజాబలం ఉన్న వారిని యాక్టివ్ చేసేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.అయితే కొంతమంది ఒకే పార్టీ తరఫున తిరిగితే పెద్దగా కలిసి వచ్చేది ఏమీ ఉండదని, అదే తటస్థంగా ఉంటే మూడు పార్టీల నుంచి సొమ్ములు అందుతాయనే లెక్కల్లో ఉన్నారట.
చాలా కాలం పాటు ఓ పార్టీలో కీలకంగా వ్యవహరించిన మండల స్థాయి నాయకుడు ఒకరు మళ్ళీ పార్టీ తరఫున యాక్టివ్ అయ్యేందుకు ఐదు లక్షలు డిమాండ్ చేస్తుండగా, సదరు నాయకుడికి 2 లక్షలు ఇచ్చేందుకు ఆ పార్టీ ఒప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఓటర్లకు , తటస్థులకు గతంలో పార్టీ తరఫున యాక్టివ్ గా ఉండి ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నవారికి ఈ మునుగోడు ఎన్నికల్లో మంచి డిమాండ్ ఏర్పడింది.