మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడే కొద్ది ప్రధాన రాజకీయ పార్టీలన్నీ స్పీడ్ మరింత పెంచుతున్నాయి.ఈ విషయంలో అధికార పార్టీ టిఆర్ఎస్ దూకుడుగా ఉండగా, బిజెపి గెలుపు ధీమా తో ఉంది.
ఇక కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించి తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఉంది.దీనికోసం గ్రూపు రాజకీయాలను సైతం పక్కనపెట్టి సమిష్టిగా ఎన్నికలను ఎదుర్కోవాలనే లక్ష్యాన్ని కాంగ్రెస్ అధిష్టానం విధించడంతో, కాంగ్రెస్ కీలక నాయకులంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు.
ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరుని ఖరారు చేయాలని, అలా చేస్తేనే తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని అధిష్టానం వద్ద వెంకటరెడ్డి ఒత్తిడి తీసుకురావడంతో, అప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా కృష్ణారెడ్డిని ఎంపిక చేసి పేరును ప్రకటించేందుకు సిద్ధమైన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారు.
వెంకటరెడ్డి చెప్పినట్లుగానే పాల్వాయి స్రవంతి పేరును ఫైనల్ చేశారు.అయితే వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారంలోకి వస్తారని కాంగ్రెస్ శ్రేణులంతా ఎదురు చూస్తుండగా, ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట.
మరో మూడు రోజుల్లో ఆయన విదేశాలకు వెళ్లి… ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వెనక్కి రాబోతున్నట్టు సమాచారం.దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా వెంకటరెడ్డి పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మొదటి నుంచి రేవంత్ వర్గానికి వెంకటరెడ్డికి మధ్య అంత సయోధ్య లేకపోవడం , వెంకటరెడ్డి కోవర్ట్ అంటూ అనేక సందర్భాల్లో రేవంత్ విమర్శలు చేయడం ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారు.గతంలో వచ్చిన ఆరోపణలను నిజం చేసే విధంగా వెంకటరెడ్డి ఇప్పుడు మునుగోడు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటూ బిజెపి అభ్యర్థిగా ఉన్న తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి విజయానికి పరోక్షంగా సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యక్తం అవుతున్నాయట.







