గత కొద్ది రోజులుగా చూసుకుంటే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల యాక్టివ్ అయ్యారు.తమపై విమర్శలు చేసిన వారిని సంచలన విమర్శలతో సమాధానం చెబుతున్నారు.
పొలిటికల్ గా మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో షర్మిల మంత్రులు, ఎమ్మెల్యేలపై ఘాటుగా విమర్శలు చేస్తున్న క్రమంలో… ఆమె చేస్తున్న విమర్శలపై టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ హక్కులకు భంగం కలిగే విధంగా షర్మిల విమర్శలు చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. వెంటనే షర్మిలపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో కోరారు.దీనిపై స్పందించిన స్పీకర్ దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామంటూ హామీ కూడా ఇవ్వడంతో, త్వరలోనే అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ షర్మిలను తమ ముందు హాజరు కావలసిందిగా కోరే అవకాశం కనిపిస్తోంది.
ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఉన్నారు.ఈ కమిటీలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్ , తాడికొండ రాజయ్య, లక్ష్మారెడ్డి , జోగు రామన్న ఎంఐఎం ఎమ్మెల్యేలు, సీఎల్పీ నేత మల్లు బట్టు విక్రమార్క వంటి వారు సభ్యులుగా ఉన్నారు.
స్పీకర్ నుంచి వీరికి ఆదేశాలు వెళితే తప్పకుండా విచారణ చేస్తుంది.ఈ విచారణలో షర్మిల వ్యాఖ్యలు నిజంగానే ఎమ్మెల్యేలు హక్కులకు కలిగించే విధంగా ఉంటే షర్మిలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ కు సిఫార్సు చేసే అవకాశం ఉంది.

దీంతో షర్మిలపై స్పీకర్ ఏం చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.అంతకంటే ముందుగా అసలు షర్మిల ప్రివిలేజ్ కమిటీ ముందుకు హాజరవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది.అయితే షర్మిల మాత్రం తనపై చర్యలు తీసుకుంటే యాక్షన్ కు రియాక్షన్ తీవ్రంగానే ఉంటుందంటూ హెచ్చరికలు చేయడంతో షర్మిల వ్యవహారంలో అధికార పార్టీ ఏ విధంగా వ్యవహరించబోతుందనేది ఆసక్తికరంగా మారింది.ఏది ఏమైనా గత కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్నాం పరిణామాలు పార్టీకి కాస్త ఊపు తీసుకొచ్చినట్టుగానే కనిపిస్తున్నాయి.







