ప్రభుత్వ పథకాలు అందుకునే క్రమంలో సామాన్యులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.నిబంధనలు పట్టించుకోకుండా చాలా మంది ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తుంటారు.
అర్హులైనప్పటికీ లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు సకాలంలో అందకుండా రోజులు తరబడి సాగదీస్తారు.దీంతో సామాన్యులు, పేద ప్రజలు చాలా బాధపడుతుంటారు.
అయితే కొందరు మాత్రమే తమకు ఎందుకు సంక్షేమ పథకాలు అందలేదో అని తెలుసుకుని పోరాడుతారు.ఇంకొందరు అయితే ప్రభుత్వ అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారు.
అప్పటికీ పరిష్కారం దొరకక పోతే నిరసన చేపడతారు.తాజాగా తనను రికార్డుల్లో మృతి చెందినట్లు పేర్కొని, పింఛను నిలిపి వేసిన అధికారులకు ఓ వృద్ధుడు చుక్కలు చూపించాడు.
దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హర్యానా రాష్ట్రం రోహతక్ జిల్లాకు చెందిన దూలీ చాంద్ అనే వృద్ధుడి వయసు 102 సంవత్సరాలు.
అతడికి ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం సామాజిక పింఛను అందజేస్తోంది.అయితే ఈ ఏడాది జనవరిలో అతడికి అందే పింఛనును అధికారులు నిలిపి వేశారు.
కారణం ఏంటని ఆరా తీయగా అతడు చనిపోయినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు.దీంతో దూలీ చాంద్ అవాక్కయ్యాడు.
పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయాడు.దీంతో నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్నాడు.
తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సాయంతో చర్చించాడు.తాజాగా పెళ్లి కొడుకు వేషధారణలో, ఊరేగింపుగా వచ్చి అధికారులకు వినతిపత్రం ఇచ్చాడు.
తాను ఇంకా బ్రతికే ఉన్నానని అధికారుల ఆఫీసుల ముందు నిరసన చేపట్టాడు.దీంతో ఈ వృద్ధుడు తెలిపిన నిరసనను కొందరు వీడియో తీసి ట్విట్టర్లో పెట్టడంతో దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
అధికారులకు బాగా బుద్ధి చెప్పాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







