‘దేశం కోసం- ధర్మం కోసం ‘ అనే నినాదాన్ని బిజెపి తరచుగా ఉపయోగిస్తూ ఉంటుంది.ఇప్పుడు అదే నినాదాన్ని టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్రం కోసం – టిడిపి కోసం అన్నట్లుగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.
ముఖ్యంగా బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోబోతోంది అనే ప్రచారం ఉదృతమైన నేపథ్యంలో బాబు తాజాగా దీనిపై స్పందించారు.కొద్దిరోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ తో చంద్రబాబు భేటీ అయిన దగ్గర నుంచి బిజెపి టిడిపి పొత్తు వ్యవహారం తెరపైకి వచ్చింది.
ఇక తర్వాత నుంచి టిడిపి అనుకూల మీడియాలోనూ, బిజెపి, టిడిపి పొత్తు అంశం పైనా అనేక కథనాలు వెలుపడ్డాయి .కేంద్ర బీజేపీ పెద్దలు టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల సమయం నాటికి ఇది జరుగుతుందని, ఏపీలో జనసేన, బీజేపీ, టిడిపి కూటమిగా ఏర్పడి వైసిపి పై పోటీ చేస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
దీనిపై తాజాగా ఈ వ్యవహారంపై మీడియా సమావేశం నిర్వహించిన బాబు అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చారు.ఎన్డీఏ లో చేరిక అంశంపై తాను ఇప్పుడే స్పందించనని, అప్పట్లో ఏపీ ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుంచి తాము బయటకు వచ్చామని అన్నారు.
రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే , సీఎం జగన్ వల్ల జరిగిన నష్టం ఎక్కువగా ఉందన్నారు.తాము అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా పరిపాలన పైనే దృష్టి పెట్టడంతోనే పార్టీ రెండుసార్లు నష్టపోయిందని , ఏపీకి మంచి పేరు తీసుకురావాలనే తపనతో వ్యక్తిగతంగా తాను ఎంతో నష్టపోయానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశ మేనని , రాష్ట్ర విభజన వల్ల ప్రజలు భయాందోళనలు ఉన్నప్పటికీ , తెలంగాణ కంటే మెరుగ్గా సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేస్తామని బాబు అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోణంలోని కేంద్ర రాజకీయాలను చూస్తామని, తాము ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని బిజెపితో పొత్తు అంశాన్ని ప్రస్తావిస్తూ అన్నారు.వైసిపి నేతలు కూడా ఇప్పుడు కంటి నిండా నిద్రపోవడం లేదని, వ్యవస్థలు నాశనం అయ్యాక ఎవరు ఏమి చేయలేని పరిస్థితి వచ్చేసిందని, టిడిపి అధికారంలోకి వస్తే రెట్టింపు స్థాయిలో సంక్షేమ పథకాలను అందిస్తామని బాబు చెప్పారు.ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం రిపబ్లిక్ టీవీ లో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కొత్తకూటమి ఏర్పడుతోందని, ఎన్డీఏలోకి టిడిపి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని కథనం ప్రచారం చేసింది.” ఎన్డీఏలోని ప్రధాన పార్టీగా ఉన్న బిజెపి టిడిపి లు తెలుగు రాష్ట్రల్లో పొత్తుల కోసం చర్చలు జరుపుతున్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఇటీవల భేటీ అయ్యారు.
రెండు రాష్ట్రాల్లోనూ టిడిపికి మంచి ఓటు బ్యాంకు ఉండడంతో టిడిపితో పొత్తు పై బిజెపి యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ” అంటూ రిపబ్లిక్ టీవీ తన కథనంలో పేర్కొంది.ఇదిలా ఉంటే టిడిపి తో పొత్తు అంశంపై ఇప్పటికే బీజేపీ నేతలు స్పందించారు .అయితే బాబు మాత్రం బిజెపి నేతల వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని పొత్తుపై తాను స్పందించనని, కానీ రాష్ట్రం కోసం పార్టీ కోసం తాము నిర్ణయం తీసుకుంటామని చెబుతుండడం, ఎన్డీఏలో చేరేందుకు ఈ మేరకు బీజేపీ ని ఒప్పించేందుకు తంటాలు పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు.







