ఏపీ అధికార పార్టీ వైసీపీలో గ్రూపు రాజకీయాలు కొత్తేమీ కాదు.పార్టీ ఆవిర్భావం నుంచి ఇవి ఉన్నా, పెద్దగా ఫోకస్ కాలేదు.
కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రూపు రాజకీయాలు మరింత విజృంభించాయి.తమకు సరైన రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదని, వేరే వర్గం వారికి ఎక్కువ ప్రాధాన్య ఇస్తూ పార్టీ కోసం కష్టపడిన తమను పక్కన పెడుతున్నారని, ఇలా అనేక కారణాలతో ఎవరో ఒకరు అసమ్మతి లేవనెత్తుతూ పార్టీకి ఇబ్బందికరంగా మారారు.
రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలోని గ్రూపు రాజకీయాలు సర్వసాధారణంగా మారిపోయాయి.చివరకు ఇవి పార్టీని దెబ్బతీసే వరకు వెళ్లిపోయాయి .ఎప్పటికప్పుడు ఈ గ్రూపు రాజకీయాలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, పెద్దగా వర్కౌట్ కాలేదు.ప్రధాన నాయకులు , ప్రధాన నియోజకవర్గాల్లోని ఈ గ్రూపు రాజకీయాలపై స్వయంగా జగన్ ఫోకస్ పెట్టి , సదరు నాయకులను తాడేపల్లికి పిలిపించి మరీ క్లాస్ పీకే వారు.
ఇక మిగతా నియోజకవర్గాల్లో మంత్రులకు ఆ బాధ్యతలను అప్పగించేవారు.అయినా ఆ పరిస్థితులు పెద్దగా మార్పు అయితే కనిపించడం లేదు.ఇప్పుడు వైసిపి పూర్తిగా రాబోయే సార్వత్రిక ఎన్నికలపైనే ఫోకస్ పెట్టింది.ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, కాస్త కష్టపడితే 2024 ఎన్నికల్లోను వైసీపీ గెలుస్తుందనే నమ్మకంతో జగన్ ఉన్నారు.
అయితే దీనిపై అంతర్గతంగా చేస్తున్న సర్వేలో గ్రూప్ రాజకీయాలు చాలా నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేస్తాయనే రిపోర్టులు అందండంతో జగన్ అలర్ట్ అయ్యారు.తాను 2024 ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాననే విషయాన్ని పార్టీ శ్రేణులకు, కీలక నాయకులకు ఇప్పటికే జగన్ చెప్పారు.
ప్రజల నుంచి కాకుండా, సొంత పార్టీ నాయకుల కారణంగా వైసిపి కి ఇబ్బందులు ఏర్పడతాయనే సర్వే ఫలితాలతో జగన్ అలర్ట్ అయ్యారు.ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలను పరిష్కరించి నాయకులు మధ్య సఖ్యత పెంచడమే లక్ష్యంగా ఇప్పుడు వైసీపీ ముందడుగు వేస్తోంది.

పార్టీ బాధ్యతలను ముఖ్య నాయకులకు జగన్ అప్పగించారు.మరికొన్ని చోట్ల తమకు సరైన ప్రాధాన్యత దక్కలేదని నాయకుల్లో అసంతృప్తి ఉండడంతో, వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఫలితాలు రాని ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని జగన్ నిర్ణయించుకోవడంతో, వారిని ఎప్పటి నుంచి బుజ్జగించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఈ మేరకు జిల్లా ఇన్చార్జి మంత్రులు, కీలక నాయకులకు జగన్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
నియోజకవర్గాల వారిగా అసమ్మతి నాయకులు అందరితోనూ అంతర్గతంగా సమావేశాలు నిర్వహించి వారికి హితబోధ చేయాలని పార్టీ విజయం కోసం కృషి చేయాలని గట్టిగానే చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయినా మాట వినని నాయకులను వారి విచక్షణకి వదులువేయాలని, నియోజకవర్గాల వారిగా అసమతి నాయకులను, పార్టీకి డామేజ్ చేసే వారి వివరాలను ఇప్పటికే వైసీపీ అధిష్టానం సేకరిస్తున్నట్లు సమాచారం.







