తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల గురించిన చర్చే జరుగుతోంది.ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయంపై జనాల్లోనూ ఆసక్తి పెరిగిపోతుంది.
అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, ఈ స్థాయిలో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.ఇంకా ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడకపోయినప్పటికీ, అన్ని ప్రధాన పార్టీలు ముందుగానే అలెర్ట్ అయిపోయాయి.
ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటుకోవాలని బిజెపి ప్రయత్నిస్తుండగా , తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.ఇక అధికార పార్టీ టిఆర్ఎస్ విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా మూడోసారి టిఆర్ఎస్ గెలుపునకు డొఖా ఉండదనే సంకేతాలను పంపించాలని చూస్తున్నారు.
రేపు మునుగోడులో బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు.ఈ సభలో భారీ ఎత్తున చేరికలు ఉండేలా బిజెపి ప్లాన్ చేసుకుంది.ఈ మేరకు భారీ ఎత్తున జన సమీకరణ చేపడుతోంది.
టిఆర్ఎస్ కూడా ఈరోజు మునుగోడు లో ప్రజా దీవెన పేరుతో సభను నిర్వహించాలనే ప్లాన్ లో ఉంది. ఈ సభలోనే మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి టిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు టిఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సభ కు సిపిఐ కూడా వెళ్లనుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ , సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి , మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి రావాలని కోరారు.

దీంతో సీఎం వాహనంలోనే చాడా వెంకటరెడ్డి మునుగోడు కు వెళ్లనున్నట్లు సమాచారం.దీని కోసం భారీగానే ఏర్పాట్లు చేశారు.బిజెపి , కాంగ్రెస్ లకు ధీటుగా ఈ సభను నిర్వహించాలని చూస్తున్నారు.
ఈ బహిరంగ సభ ద్వారా ప్రజల మద్దతు పొందేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు చేకూరిన లబ్ధి అలాగే మునుగోడు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం ఇలా అనేక అంశాలను ప్రస్తావించబోతున్నారు.
ఇక టీఆర్ఎస్ సభను జనాలు ఎంతవరకు పట్టించుకుంటారు .? టీఆర్ఎస్ అభ్యర్థికి ఎంతవరకు ప్రజా దీవెనలు అందిస్తారు అనేది వేచి చూడాల్సిందే.







