నిన్న ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.చాలాకాలంగా ఎడమొహం పెడముఖంగా ఉంటున్న ప్రధాని నరేంద్ర మోదీ, టిడిపి అధినేత చంద్రబాబు ఓ సమావేశంలో భేటీ అవ్వడం, ప్రత్యేకంగా మాట్లాడుకోవడం తదితర వ్యవహారాలు చోటు చేసుకోవడంతో ఏపీలో ఆసక్తికరమైన రాజకీయ చర్చ జరుగుతోంది.
నిన్న రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఆజాధీకా అమృత్ మహోత్సావ్ కమిటీ సమావేశానికి కేంద్రం ఆహ్వానంపై చంద్రబాబు వెళ్లారు.ఈ సమావేశం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ భేటీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ లో లేకపోయినా, ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడారు.
ఈ సందర్భంగా వారిద్దరూ కొంచెం పక్కకు వెళ్లి ఏకాంతంగా మాట్లాడుకున్నారు.
అయితే వీరిద్దరి మధ్య ఏకాంత చర్చ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం గా మారింది.ప్రస్తుతం ఏపీ బీజేపీ నేతలు టిడిపిని పొగుడుతూ చంద్రబాబును ప్రశంసిస్తున్నారు.
గతంలో టిడిపి, చంద్రబాబు పేరు చెబితే విరుసుకుబడిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం ఇప్పుడు చంద్రబాబును పొగిడేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.ఒకవైపు టిడిపి బిజెపితో పొత్తు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిన సమయంలోనే, ప్రధాని తో చంద్రబాబు ఏకాంత చర్చలు జరపడంతో రాబోయే ఎన్నికల నాటికి టిడిపి బిజెపి మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది.

అదే జరిగితే ఏపీలో రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని, 2014 ఎన్నికల ఫలితాలు మళ్లీ రిపీట్ అవుతాయనే నమ్మకంతో టిడిపి శ్రేణులు ఉన్నాయి.తమను సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని, బిజెపి, టిడిపి ,జనసేన మధ్య పొత్తు కుదిరే ఛాన్స్ లేదని జనసేన, బిజెపి కలిసి పోటీ చేసినా, తమ ఓటు బ్యాంకు కు నష్టమేమీ లేదన్న లెక్కల్లో ఉన్న వైసిపికి ఇప్పుడు చంద్రబాబు ప్రధాన నరేంద్ర మోధీ మధ్య జరిగిన చర్చలు నేపథ్యంలో ఆందోళన చెందుతోంది.







