గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతూ వస్తున్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు.
అయితే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఒకేసారి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని అంతా భావించినా, ఆయన మాత్రం పార్టీకి మాత్రమే ప్రస్తుతం రాజీనామా చేశారు.పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు.
ఈ సందర్భంగా సోనియాకు రాసిన లేఖలో రాజగోపాల్ రెడ్డి అనేక విమర్శలు చేశారు.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైనా విమర్శలు చేశారు.పార్టీలో తనుకు ఎదురైన అనుభవాలు, తాను రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించారు.30 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని , కానీ కాంగ్రెస్ విధేయులైన వారిని అవమానిస్తున్నారని సోనియాకు రాసిన లేఖలో రాజగోపాల్ పేర్కొన్నారు.
పార్టీ ద్రోహులకు, అధ్యక్షురాలి పైన వ్యక్తిగత విమర్శలు చేసిన వారికి కీలక బాధ్యతలు అప్పగించడం తనను తీవ్రంగా బాధించిందని రాజగోపాల్ వివరించారు. ప్రజాప్రతినిధిగా చేయకూడని పనులు చేసి జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో తాను పనిచేయలేనన్నారు.
ఎమ్మెల్యేలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింప లేనివారు పోరాట కార్యాచరణ రూపొందించలేక పార్టీని నిర్వీర్యం చేశారని రాజగోపాల్ విమర్శించారు.ప్రజాస్వామ్య పాలన కోసం రాజకీయ పోరాటం చేయాలనుకుంటున్నానని, అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి సోనియాకు రాసిన లేఖలో వివరించారు.
అయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడినా నష్టమేమీ లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ ఎవరు రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లకుండా ఈరోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.చుండూరు జడ్పీ హైస్కూల్ గ్రౌండ్ లో జరిగే సభకు పార్టీ సీనియర్ నేతలు దామోదర్ రెడ్డి , అంజన్ కుమార్ యాదవ్ , మల్లు రవితో పాటు స్థానిక నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడినా నష్టమేమీ లేదు అన్న సంకేతాలను పంపించేందుకు భారీ స్థాయిలో ఈరోజు జరిగే సభకు జన సమీకరణకు ఏర్పాట్లు చేపట్టారు.