దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి.
భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండాయి.వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
కొన్ని చోట్ల వాగులపై ఉండే చిన్న చిన్న వంతెనలు కొట్టుకుపోగా.మరి కొన్ని మునిగిపోయాయి.
చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వంతెనలు మునిగి పోయాయి.పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అటు నుండి ఇటు వైపుకు వెళ్లేందుకు కొందరు ఆ వంతెనలపై నుండి వెళ్తూ సాహసాలు చేస్తున్నారు.ప్రవాహం తక్కువగా ఉందని తప్పుగా అంచనా వేసి ప్రమాదాల బారిన పడుతున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలకు చిత్రావతి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.వరద ఉద్ధృతితో ఏపీలోని శ్రీ సత్య సాయి జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
సుబ్బారావు పేట నుండి కొడికొండ వైపు వెళ్లే దారిలో నదిపై వంతెన ఉండగా.దాని పైనుండి నీళ్లు ప్రవహిస్తున్నాయి.ఓ ఆటో ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేసి ఆ వంతెన పై నుండి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.నీటి ప్రవాహ వేగానికి ఆటో టైర్లు పట్టు కోల్పోయాయి.
నీరు ఆటోను లాక్కెలుతూ నదిలో పడేశాయి.ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో ఆటో నదిలో పడి కొట్టుకు పోయింది.ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్ శంకరప్ప మాత్రమే ఉండగా.అతడు నదిలో పడి గల్లంతు అయ్యాడు.
ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలో ఒడ్డున ఉన్న స్థానికులు వీడియో తీయగా అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నదిలో కొట్టుకుపోయిన డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.