వైసిపి పని అయిపోయిందని, ఇక మరోసారి అధికారంలోకి రావడం కష్టమని పూర్తిగా సొమ్ములన్నీ సంక్షేమ పథకాల కి జగన్ ఖర్చు పెడుతూ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడంలేదని, ఇలా ఎన్నో విమర్శలు జగన్ ఎదుర్కొంటున్నారు.అయినా సంక్షేమ పథకాలకు ఎటువంటి లోటు రాకుండా మరికొన్ని కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ జగన్ ముందుకు వెళుతున్నారు.
ఈ విషయంలో నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు.ఏపీలో పెద్దగా అభివృద్ధి చోటు చేసుకోకపోవడంతో, రాబోయే ఎన్నికల్లో తమ గెలుపునకు ఇబ్బందులు ఏర్పడతాయనే టెన్షన్ వారిలో ఎక్కువగా కనిపిస్తోంది.
క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లిన సందర్భంగా అక్కడక్కడ అభివృద్ధి విషయమై జనాలు నిలదీస్తున్నా, అదంతా తాత్కాలికమేనని వైసిపి పెద్దలు నమ్ముతున్నారు.అయితే ఏపీ వ్యాప్తంగా మెజార్టీ జనాలు అభివృద్ధి విషయమై అంతగా ఆలోచించరని, తమకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ? బ్యాంక్ అకౌంట్లలో సొమ్ములు పడుతున్నాయా లేదా ? ప్రభుత్వం ఇంకా కొత్త పథకాలను ప్రవేశపెడుతుందా లేదా అని విషయాలపైనే ఎక్కువ ఆలోచిస్తారని జగన్ బలంగా నమ్ముతున్నారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మరోసారి అధికారం తెచ్చిపెడుతుందనే ధీమాతో జగన్ ఉన్నారు.వైసిపి అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి జగన్ 2024 ఎన్నికల్లో గెలవడం ఎలా అనే అంశంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు.
అందుకే భారీగా సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందారు.వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేస్తారనే అభిప్రాయం జనాల్లో ఉంది.
ఎందుకంటే గతంలో ఎప్పుడు ఈ విధంగా టిడిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకపోగా, ఉన్న పథకాలకు కోతలు పెట్టిన విషయాన్ని జనాలు మర్చిపోలేదు.ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాల ఫలితాలకు ఏ ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే జగన్ ప్రభుత్వం రావాలన్న అభిప్రాయం మెజారిటీ జనాల్లో ఉందనే విషయాన్ని జగన్ గుర్తించారు.
ఇక ఉద్యోగస్తులలోను ఇదే రకమైన అభిప్రాయం ఉందని, జీతాల విషయంలో కాస్త ఆలస్యమైనా మిగిలిన విషయాల్లో ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వంలో మేలు జరుగుతోందని , ఎటువంటి ఒత్తిడి లేకుండా పనిచేసుకోగలుగుతున్నామని అదే టిడిపి ప్రభుత్వం వస్తే తీవ్ర ఒత్తిడికి గురవ్వాలని చాలామంది ఉద్యోగులు భావిస్తున్నారట.

ఇక ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వ పరం చేశారు.ఆ సంస్థ ఉద్యోగులందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో, దాదాపు లక్షన్నర కుటుంబాలు జగన్ విషయంలో సానుకూలంగా ఉన్నారు.మళ్లీ టీడీపీ కనుక అధికారంలోకి వస్తే ఆర్టీసీని కార్పొరేషన్ చేస్తే తమకు ఇప్పుడు వరకు అందుతున్న బెనిఫిట్స్ ఆగిపోతాయన్న భయము ఆర్టిసి ఉద్యోగుల్లో నెలకొనడం ఇలా ఎన్నో అంశాలలో వైసిపికి కలిసొచ్చే అంశాలే ఎక్కువ ఉండడం తో గెలుపు పై జగన్ లో ఆ స్థాయిలో ధీమా పెరుగుతోందట.







