మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా పార్టీకి, పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరబోతున్నారనే విషయంలో దాదాపు ఒక స్పష్టత వచ్చేసినట్టే కనిపిస్తుండడంతో , తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ అలర్ట్ అయింది.ఖచ్చితంగా మునుగోడులో ఉప ఎన్నికలు వస్తాయి అని, ఎన్నికల్లో గెలుపోవటములే రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు నిదర్శనమని అన్ని పార్టీలు భావిస్తూ ఉండడంతో, అందరికంటే ముందుగా టిఆర్ఎస్ మునుగోడు పై ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ మేరకు ఇప్పటికీ మూడు సర్వే సంస్థలను రంగంలోకి దించేందుకు కేసిఆర్ సిద్ధమయ్యారు.ఈ మూడు సర్వే సంస్థలు మునుగోడులో ఏ ఏ పార్టీకి ఏ స్థాయిలో బలం ఉంది ? ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఏ విషయంలో వ్యతిరేకత ఉంది టిఆర్ఎస్ తరఫున ఎవరిని అభ్యర్థిగా నిలబడితే గెలుపు దక్కుతుంది ? ఇలా అనేక అంశాలపై సర్వే టీమ్ లు రంగంలోకి దిగబోతున్నాయట.
ఈ మూడు సర్వే సంస్థలు చేసిన సర్వే నివేదికల ఆధారంగా ముందుకు వెళ్లాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారట.ఇప్పటికే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.మంత్రి జగదీష్ రెడ్డి విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు .టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యం అయితే టిఆర్ఎస్ , కాంగ్రెస్, బిజెపి మధ్య పోరు తీవ్రంగా ఉంటుంది.ఇక టిఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కర్నాటి విద్యాసాగర్, కర్నే ప్రభాకర్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఈ ముగ్గురిలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయనే దానిపైన ఇప్పుడు సర్వే సంస్థలు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం తెలుసుకోబోతున్నాయట.మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడంతో, విద్యాసాగర్ కు టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారట.

కాంగ్రెస్ నుంచి కైలాస్, పల్లె రవి, పాల్వాయి స్రవంతి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.గతంలో ఈ నియోజకవర్గంలో నుంచి పాల్వాయి స్రవంతి గతంలో పోటీచేసి ఓటమి చెందగా, కైలాష్, పల్లె రవి ఇద్దరు బిసి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ , బిజెపిలు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం పై దృష్టి సారించి రంగంలోకి దిగిపోయాయి.రాజగోపాల్ రెడ్డి బిజెపి కండువా కప్పుకోవడమే తరువాయి అన్నట్లుగా ఈ నియోజకవర్గంలో పర్యటించేందుకు అన్ని పార్టీల అగ్ర నేతలు సిద్ధమవుతున్నారు.







