అమెరికా రాజకీయాల్లో భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే గవర్నర్లుగా, కాంగ్రెస్ సభ్యులుగా, సెనేటర్లుగా, మేయర్లుగా సత్తా చాటుతున్నారు.
అలాంటి దశలో ఏకంగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారీస్ పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టించారు.ఈ క్రమంలో మరో ఇండో అమెరికన్ మహిళ అత్యున్నత పదవిని అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచారు.
మాజీ మేరీల్యాండ్ హౌస్ ప్రతినిధి అరుణా మిల్లర్ ఆ రాష్ట్ర తదుపరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికయ్యే అవకాశం వుంది.మేరీల్యాండ్ గవర్నర్గా డెమొక్రాటిక్ నామినేషన్లో విజేతగా నిలిచిన వెస్ మూర్కు అరుణ రన్నింగ్ మేట్.
ఆర్మీ వెటరన్ , మాజీ లేబర్ సెక్రటరీ, డీఎన్సీ ఛైర్మన్ టామ్ పెరెజ్, మేరీలాండ్ కంప్ట్రోలర్ పీటర్ ఫ్రాన్చాట్లను డెమొక్రాటిక్ నామినేషన్ సమయంలో మూర్ ఓడించారు.ప్రస్తుతం రిపబ్లికన్ గవర్నర్ లారీ హోగన్ చేతుల్లో నుంచి అధికారాన్ని సొంతం చేసుకునేందుకు డెమొక్రాట్లకు ఇది మంచి ఛాన్స్.
ప్రముఖ వార్తాసంస్థ ఎన్బీసీ కథనం ప్రకారం.కుక్ పొలిటికల్ రిపోర్ట్ మేరీలాండ్ గవర్నర్ రేసులో డెమొక్రాట్లకే అవకాశాలు మెరుగ్గా వున్నాయని అంచనా వేసింది.

హైదరాబాద్లో జన్మించిన అరుణా మిల్లర్ను మూర్ తన రన్నింగ్ మేట్గా ఎంచుకున్నారు.అరుణ … మేరీల్యాండ్ జనరల్ అసెంబ్లీకి రెండు పర్యాయాలు పనిచేయడమే కాకుండా 2017లో యూఎస్ కాంగ్రెస్కు నామినేట్ అవ్వాలని ప్రయత్నించి విఫలమయ్యారు.మూర్కు రోడ్స్ స్కాలర్గా, రచయితగా, ఎంట్రప్రెన్యూర్గా గుర్తింపు వుంది.మిల్లర్ ఒక ఇంజనీర్.మాంటోగోమేరీ కౌంటీలో , మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్గానూ అరుణ మిల్లర్ పనిచేశారు.
ఏడేళ్ల చిరుప్రాయంలో అరుణ మిల్లర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వలస వచ్చారు.2000లో అమెరికా పౌరసత్వం పొందిన మిల్లర్.హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీలో నాలుగేళ్లు, అప్రాప్రియేషన్స్ కమిటీలో నాలుగేళ్లు పనిచేశారు.
కుటుంబ సెలవులు, రవాణా విధానం, గృహ హింస, ఎస్టీఈఎం, విద్య వాటిపై పనిచేశారు.ఒకవేళ మూర్- మిల్లర్ గెలిస్తే… మేరీల్యాండ్కి తొలి నల్లజాతి గవర్నర్గా మూర్, అమెరికాలోని ఏ రాష్ట్రానికైనా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్గా మిల్లర్ చరిత్ర సృష్టిస్తారు.







