వైసీపీలో కీలక నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు.ఈనాడుతో ఆయన జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించినా సాక్షి పత్రికలో కీలక బాధ్యతలు పోషించారు.
సాక్షి మీడియాలో ఎడిటోరియల్ డైరెక్టర్గా, పబ్లిషర్గా నియమితుడయ్యారు.అయితే వైసీపీ స్థాపించిన తర్వాత రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.
దీంతో ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏకంగా ప్రభుత్వ సలహాదారు పోస్టును ఆయనకు జగన్ కట్టబెట్టారు.
ప్రభుత్వ సలహాదారు పోస్టులో తనదైన మాటల శైలిలో టీడీపీపై సజ్జల విరుచుకుపడుతుంటారు.అయితే లేటెస్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.పార్లమెంట్లో కీలక బిల్లులకు బీజేపీకి వైసీపీ మద్దతు ఇచ్చిందనే విషయం చిన్నపిల్లాడికి కూడా తెలుసు.కానీ తాము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏ ఒక్క బిల్లుకూ వైసీపీ మద్దతు ఇవ్వలేదని సజ్జల వ్యాఖ్యానించారు.వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు, రైతుల మోటార్లకు మీటర్లు బిగించే బిల్లుకు, కాశ్మీర్ విభజన బిల్లుకు సహా అనేక బిల్లులకు గతంలో వైసీపీ మద్దతు ఇచ్చింది.

కానీ సజ్జల మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదని.బీజేపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరు అని వివరించడం ప్రజల చెవిలో క్యాలీఫ్లవర్, క్యాబేజీలు పెట్టిన చందాన ఉందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.పనిలో పనిగా తమకు ఎర్రకోట మీద జెండా ఎగరేయాలని, ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు.సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి రాష్ట్ర ప్రయోజనాల మీదే ఉందని వివరించారు.
రాజ్యాంగపరమైన పదవుల విషయంలో ఏకాభిప్రాయం ఉండాలన్నది తమ విధానం అని.అందుకే ఎస్టీ మహిళ రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి తమ పార్టీ మద్దతు ఇచ్చిందన్నారు.

గతంలో టీడీపీ హయాంలో స్పీకర్ కోడెల శివప్రసాద్కు కూడా మద్దతు ఇచ్చినట్లు సజ్జల గుర్తుచేశారు.అయితే రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై టీడీపీ ఎందుకు ఇంత వరకు తన వైఖరి ప్రకటించటం లేదని సజ్జల ప్రశ్నించారు.రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు ఉంటేనే మద్దతు ఇస్తారా అని నిలదీశారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన నూరుశాతం హామీలను వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని కూడా సజ్జల అంటున్నారు.ప్రత్యేకహోదా సాధిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తామంటూ ఇచ్చిన చాలా హామీలు ఏమయ్యాయో సజ్జల వివరిస్తే బాగుంటుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.







