ఇలాంటప్పుడే అదృష్టం అనే విషయాన్ని నమ్మవలసి ఉంటుంది.పోగొట్టుకున్న లక్షలు విలువైన బంగారు ఆభరణాలు ఓ ఎలుక సాయంతో పోలీసులు పట్టుకున్నారంటే నమ్మబుద్ధి కావడంలేదు కదూ.
కానీ మీరు విన్నది నిజమే.ఓ ఎలుక చెత్తకుప్పలోని 100 గ్రాముల బంగారాన్ని పట్టించింది.
ఈ ఘటన మహారాష్ట్ర, ముంబయిలోని దిండోశీ అనే ప్రాంతంలో జరగగా తాజాగా వెలుగు చూసింది.చెత్తకుప్పలో బంగారం దొరకడమేమిటి? అనే అనుమానం వస్తుంది కదూ.అయితే వెంటనే ఈ స్టోరీ చదవండి.
ఈ సంఘటన ముంబయిలోని దిండోశీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
అక్కడ ఆరే కాలనీకి చెందిన సుందరి అనే మహిళ, తన కుమార్తె వివాహం కోసం రుణం పొందేందుకు తన దగ్గర వున్న 100 గ్రాముల బంగారు ఆభరణాలతో బ్యాంకుకు వెళ్తున్నారు.ఈ క్రమంలోనే ఓ యాచకురాలు వారిని యాచించగా ఓ కవర్లో ఉన్న వడాపావ్ను ఆమెకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కట్ చేస్తే వారు బ్యాంకుకు వెళ్లి చూసుకోగా బంగారం కనిపించలేదు.దాంతో వారు దీర్ఘ ఆలోచనలో పడగా వడాపావ్ ఇచ్చిన బ్యాగ్లోనే బంగారం ఉన్నట్లు గమనించారు.హుటాహుటిన ఆ యాచకురాలు కనిపించిన ప్రాంతానికి వెళ్లారు.కానీ, అక్కడ ఆమె కనబడలేదు.
వేరేదారిలేక పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న దిండోశీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ సూరజ్ రౌత్ తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో సదరు పరిసర ప్రాంతాల్లోని CCTV కెమెరాలను పరిశీలించగా, ఆ యచకురాలు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు.తరువాత ఆమెను పట్టుకుని విచారించగా.
వడాపావ్ కవర్ను చెత్తకుప్పలో పడెసినట్లు తెలిపింది.దాంతో పోలీసులు చెత్తకుప్పలో వెతికినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది.
ఆ తరువాత చెత్తకుప్ప సమీపంలోని CCTV కెమెరాలను క్షణ్నంగా పరిశీలించగా ఓ ఎలుక ఆ బ్యాగ్ను పట్టుకుని ఉన్నట్లు గుర్తించారు.అలా దాన్ని వెంబడించి ఆఖరికి ఆ బంగారాన్ని పట్టుకున్నారు.
అనంతరం సుందరి కుటుంబ సభ్యులకు అప్పగించారు.