కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన అలజడి కంటే కూడా అమెరికాపై చూపించిన ప్రభావం ఊహకు కూడా అందనంత దారుణంగా ఉంది.కరోనా వేరియంట్స్ వరుసగా అమెరికాపై దాడి చేయడంతో అమెరికా ఆర్ధిక వ్యవస్థ ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితిలోకి వెళ్ళిపోయింది.
అమెరికాకు వచ్చి వెళ్ళే వారి రాకపోకలపై లెక్కకు మించి ఆంక్షలు విధించబడ్డాయి.ఫలితంగా అమెరికాకు వెళ్ళే ఎన్నారైలు ఎంతో మంది సుదీర్ఘకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఎర్పండిది.
కాగా కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత కూడా తమ దేశంలోకి వచ్చే వారిపై పరిమితి ఆంక్షలు విధించింది అమెరికా.
అమెరికా వచ్చే వారు ఎవరైనా సరే 24 గంటల ముందు కరోనా పరీక్షలు చేసుకుని అందులో నెగిటివ్ వస్తేనే తమ దేశంలోకి అడుగు పెట్టాలని సూచించింది.
ఈ పద్దతిలోనే ఇప్పటి వరకూ అమెరికా వెళ్ళే వారు తప్పనిసరిగా ముందు రోజు కరోనా పరీక్షలు చేసుకుని అందులో రిజల్ట్ ఆధారంగా అమెరికా వెళ్ళాల్సి వచ్చేది.అయితే ఈరోజు మధ్యాహ్నం అంటే ఆదివారం 12 గంటల నుంచీ ఈ నిభందనకు స్వస్తి చెప్తోంది అమెరికా.
ఇకపై ఎలాంటి ముందస్తు టెస్ట్ లు అవసరం లేదని గతంలో మాదిరిగా ప్రయాణాలు చేసుకోవచ్చునని కీలక ప్రకటన చేసింది.
అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) డైరెక్టర్ వాల్కేన్సీ ఈ ప్రకటన చేసారు.
వేసవి కాలం కావడంతో అమెరికాకు వచ్చే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే సమయంలో విమానయాన సంస్థలకు ఎలాంటి నష్టం వాటిల్ల కూడదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.ఇదిలాఉంటే ఈ నిభందన కరోనా పరిస్థితులపై తమకు ఎప్పటికప్పుడు అందే సమాచారం పై ఆధారపడి ఉంటుందని, మూడు నెలలకు ఒకసారి తాము ఏర్పాటు చేసే సమీక్షా సమావేశాలలో భవిష్యత్తు నిర్ణయాలని ప్రకటిస్తామని వాల్కేన్సీ ప్రకటించారు.







