సంకలో కొట్ల రూపాయిల డబ్బులు పెట్టుకుని వంద రూపాయల పెట్టి వాటర్ బాటిల్ కొనడానికి వెనకాడడం అంటే ఇదే కాబోలు.సరిగ్గా ఇలాగే ఒక వ్యక్తి చేతిలో రెండు కోట్ల రూపాయల డబ్బు పెట్టుకుని రైలు టికెట్ కొనడానికి వెనకాడాడు.
తీరా చూస్తే రైల్వే అధికారులకు అడ్డంగా బుక్ అయిపోయి డబ్బులకు డబ్బులు పోగొట్టుకున్నాడు.జైలుకు కూడా వెళ్ళవలిసిన పరిస్థితి వచ్చింది.
ఇంతకీ అతనికి ఆ డబ్బు ఎక్కడిది.? అంత డబ్బులు ఉంచుకుని టికెట్ ఎందుకు కొనలేదు అని ఆలోచిస్తున్నారా.? అసలు వివరాల్లోకి వెళితే.రాజస్థాన్ లోని సుంత్రా జిల్లా జాలోర్ తాలుకా వారన్వా గ్రామ వాసి అయిన జెన్ సింగ్ అలియాస్ మనోహర్ సింగ్ అనే వ్యక్తి జూన్ 8న ముంబై లోని ఛత్రపతి శివాజి టెర్మినస్ నుంచి మంగళూరు వెళ్లే రైలు ఎక్కాడు.
అయితే ఈ వ్యక్తి టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కాడు.రైలు మహారాష్ట్ర సరిహద్దు దాటిన తరువాత టికెట్ కలెక్టర్ వచ్చి రైలులో ప్రయాణం చేసే ప్రయాణికులందరినీ టికెట్ చూపించమని అడిగాడు.
ఈ క్రమంలోనే జెన్ సింగ్ను కూడా టికెట్ అడిగాడు.కానీ అతడు తన దగ్గర టికెట్ లేదని చెప్పాడు.అంతేకాకుండా టికెట్ కలెక్టర్ కు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడు.టికెట్ కలెక్టర్కు అతని మీద అనుమానం వచ్చి వెంటనే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్కు సమాచారం ఇవ్వగా రైల్వే ఇన్స్పెక్టర్ విపిన్ సింగ్ రాణా మధ్యలో రైలు ఎక్కి జన్సింగ్ ను ప్రశ్నించాడు.
అతడు చెప్పే సమాధానాలు తికమకగా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చి బ్యాగ్ చెక్ చేయగా బ్యాగ్ లో నోట్ల కట్టలు కనిపించాయి.
వాటిని చూసి అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.అందులో మొత్తం రూ.2 కోట్ల నగదు ఉందని, అన్ని కూడా రూ.2వేల నోట్లే ఉన్నాయి.ఆ డబ్బునంతా పోలీసులు స్వాధీనం చేసుకుని శిరవాడ రైల్వే పోలీసులకు అతనిని అప్పజెప్పారు.అంత డబ్బు నీకు ఎక్కడిది.? ఎక్కడికి తీసుకెళ్తున్నావ్.? అని ప్రశ్నించగా అసలు విషయం చెప్పేసాడు.అదంతా హవాలా డబ్బని మంగళూరులో ఓ వ్యక్తికి ఇవ్వడానికి తీసుకుని వెళ్తున్నా అని పోలీసుల విచారణలో తెలిసింది.
ఒకవేళ జెన్ కనుక టికెట్ తీసుకుని ఉంటే బహుశా రెండు కొట్ల గురించి పోలీసులకు తెలిసి ఉండేది కాదేమో కదా.







