విదేశీ పర్యటనలో వున్న భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన సతీమణి ఉషాలు గురువారం సెనెగల్ రాజధాని డకార్లోని ఆఫ్రికన్ పునరుజ్జీవనోద్యమ స్మారక చిహ్నం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఆ తర్వాత డకార్లోని నల్లజాతి నాగరికతలకు సంబంధించిన మ్యూజియాన్ని సందర్శించారు.
ఆఫ్రికన్ కళలు, సంస్కృతి, చరిత్రను ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.కాంస్యం, రాగితో చేసిన ఈ స్మారక నిర్మాణం 52 మీటర్ల ఎత్తులో వుంది.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.సెనెగల్ను ఆఫ్రికా మోడల్ ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా నిలిపినందుకు ప్రశంసించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వున్న భారత్ ఈ విషయంలో సెనెగల్ సాధించిన విజయాన్ని అభినందిస్తోందన్నారు.ప్రజాస్వామ్యం , లౌకికవాదం వంటి భాగస్వామ్యపు విలువలు రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు ఆధారమని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.

అంతకుముందు బుధవారం డకార్లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్తో వెంకయ్య నాయుడు సమావేమయ్యారు.ఈ భేటీలో భారత్- సెనెగల్ సంబంధాల పురోగతిని చర్చించారు.వ్యవసాయం, ఆరోగ్యం, రక్షణ, రైల్వేలు, ఇంధనం, సంస్కృతితో సహా వివిధ రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించారు.వెంకయ్య నాయుడు జూన్ 1 నుంచి 3 వరకు సెనెగల్లో వంటారు.
ఈ రోజు ఆ దేశ నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడు మౌస్తఫా నియాస్సే, ఇతర ప్రముఖులతో ఆయన చర్చలు జరుపుతారు.అనంతరం జూన్ 4 నుంచి 7వ తేదీ వరకు వెంకయ్య ఖతార్లో పర్యటించనున్నారు.
ఖతార్- భారత్ల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ దేశ యువరాజు షేక్ అబ్దుల్లాబిన్ హామద్ అల్తానీతో సమావేశమయ్యే భారత ఉన్నతస్థాయి బృందానికి ఉపరాష్ట్రపతి నాయకత్వం వహిస్తారు.







