2024 ఎన్నికలకు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాయి.కేంద్రంలో అధికార బీజేపీని గద్దె దించేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
అయితే దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డోలాయమానంగా మారింది.ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆ పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ అగ్ర నేతలు శతవిధాలా ప్రయతిస్తున్నారు.
ఈనెల 13, 14 తేదీల్లో రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయ్ పూర్లో నవ్ సంకల్ప చింతన్ శిబిర్ పేరిట కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తోంది.
ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇది మేథోమదన సదస్సు సమావేశంగా నేతలు భావిస్తున్నారు.రాబోయే ఎన్నికలకు ఈ సదస్సు ఒక మార్గదర్శనం చేస్తుందని సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు చాలామంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు.
త్వరలోనే పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ సదస్సు నిర్వహణ గురించి ఇటీవల ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది.
ఉదయ్పూర్లో జరగనున్న సదస్సులో పార్టీ నేతలు అనుసరించాల్సిన విధివిధానాలను సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా నిర్దేశించారు.కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో కూడా మేథోమదన సదస్సులు జరిగాయి.1998, 2003, 2013 సంవత్సరాల్లో ఇలాంటి సదస్సులను పార్టీ నిర్వహించింది.

అయితే 1998లో జరిగిన సదస్సు పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదు.2003లో జరిగిన సదస్సు మాత్రం పార్టీకి బాగానే ఉపయోగపడింది.ఈ సదస్సులో సీనియర్లు పార్టీలో లోపాలను నిజాయితీగా ఎత్తి చూపించారు.
వాటిని సరిచేసుకోవడంలో పలు సలహాలను, సూచనలను కూడా ఇచ్చారు.దీంతో 2004 ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది.అప్పటి ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయ్ నేతృత్వంలోని బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.2009 ఎన్నికల్లోనూ విజయబావుటాను ఎగురవేసింది.కానీ 2014 ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.అప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ కోలుకోలేదు.ఈ నేపథ్యంలో ఉదయ్పూర్లో జరిగే మేథోమదన సదస్సుతో అయినా కాంగ్రెస్ పార్టీ గాడిలో పడాలని ఆ పార్టీ నేతలు ఆకాంక్షిస్తున్నారు.







