యాదాద్రి జిల్లా:అక్రమ లే ఆవుట్ల రియల్ దందా పెరిగి,రియల్ వెంచర్లకు గన్ కాపాలా వచ్చిందని, దేవుడి పేరుతో ప్రజలకు టోకరా వేసే ఘనులు పుట్టుకొచ్చారని,అధికారులు ఏమీ తెలియనట్లు చోద్యం చూస్తున్నారని,ఆసైన్డ్ భూములను సంరక్షించాలని ఆలేరు కాంటెస్టేడ్ ఎమ్మెల్యే,కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు కల్లూరి రాంచంద్రారెడ్డి అన్నారు.శ్రీలక్ష్మినర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధిని చూయించి,జిల్లాలో వందల సంఖ్యల్లో వెలుస్తున్న అక్రమ లేఅవుట్ల రియల్ దందా ఆగడాలు మితిమీరిపోతున్నాయని,వీరి అక్రమ వాపారాన్ని అరికట్టాలని కల్లూరి రాంచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడాతూ ప్రభుత్వం చేస్తున్న యాదాద్రి అభివృద్ధిని చూయించి రియల్ వ్యాపారులు హైదరాబాద్ అడ్డాగా ఆక్రమ లే అవుట్ల ప్లాట్లను అందమైన బ్రోచర్లు వేసి సామాన్య,మధ్య తరగతి ప్రజలకు వారి ఏజెంట్లతో అంటగట్టి టోకారా వేస్తున్నారని తెలిపారు.యాదాద్రి దేవుడిని చూయించి చుట్టూ 50 కిలోమీటర్ల దూరంలో రియల్ దందా మూడు పువ్వులు ఆరుకాయాలుగా సాగుతున్న అధికారులు చోద్యం చూడటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
స్థానిక రాజకీయ నాయకులు,ప్రజాప్రతినిధుల అండదండలతో కాగితాల్లోనే లే అవుట్ చూయించి సబ్ రిజిస్ట్రార్ అధికారులను మేనేజ్ చేసుకొని ఆమాయకులకు ఆసైన్డ్ భూముల ప్లాట్లను అంటకట్టి రియల్ వ్యాపారులు కోట్లకు పడగలెత్తుతున్నారని వివరించారు.యాదాద్రి చుట్టూ ఉన్న ఆసైన్డ్ భూములు రియల్ వ్యాపారుల కబంధ హస్తల్లో ఉన్నాయన్నారు.
పదేండ్ల తరువాత ప్లాట్ల కోసం వచ్చిన వారికి కొనుగోలు చేసిన ప్లాటు దొరకని పరిస్థితులు జిల్లాలో వేల సంఖ్యల్లో ఉన్నాయన్నారు.తమ ప్లాటు కోసం ఆందోలన చేస్తున్న ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడానికి వెంచర్ల వద్ద తుపాకితో కాపాలాదారులను పెట్టి గన్ కల్చర్ యాదాద్రికి తీసుకువచ్చారని రియల్ వ్యాపారులపై మండిపడ్డారు.
పది సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ లే అవుట్ చేసి అమ్మిన వారు అదే వెంచర్ డిటిసిపి చేసి తిరిగి ప్రజలకు అమ్ముతున్న మోసాలు జిల్లాలో వెలుగు చూస్తున్నాయన్నారు.రెవెన్యూ,పోలీస్,పంచాయతీ,మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడమే ఈమోసాలకు కారణమని ఆరోపించారు.
తొండలు గుడ్లు పెట్టని భూములను సైతం కొనుగోలు చేసి యాదాద్రిలో మూడు నాలుగు కంపెనీలు ప్రధానంగా రియల్ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నాయన్నారు.వీరే ఇప్పుడు రాజకీయాలను సైతం శాసిస్తున్నారని ఆరోపించారు.
వారికి తొత్తులుగా వవహరించే నాయకులకు ఎన్నికల్లో పెట్టుబడి పెడుతున్నారని విమర్శించారు.ఇలాంటి ఆక్రమ రియల్ వ్యాపారానికి ప్రభుత్వం చెక్ పెట్టకుంటే వీరి బారీన పడిన సామన్య,మధ్య తరగతి ప్రజల భవిష్యత్తు అంధకారంగా మారనుందన్నారు.