సూర్యాపేట జిల్లా:మద్యానికి బానిసై కుటుంబ కలహాలతో సొంత బామ్మర్దిని బావే కత్తితో పొడిచి చంపిన దారుణ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే పట్టణంలోని జమ్మిగడ్డకు చెందిన రహీంకు షాబుద్దీన్ సోదరితో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరి కలహాల కాపురానికి ఇద్దరు పిల్లలు జన్మించారు.తాగుడుకు బానిసైన రహీం భార్య పిల్లలను వేధిస్తూ ఉండటంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో భార్య పిల్లలతో సహా తల్లిగారింటికి వెళ్ళింది.
తల్లిదండ్రులు వద్దే ఉంటూ, కూలీనాలి చేస్తూ పిల్లలను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తోంది.అప్పటి నుండి భర్త రహీం భార్యాపిల్లలకు దూరంగానే ఉంటున్నాడని తెలుస్తోంది.
మద్యానికి బానిసైన రహీం గతంలో భార్య విషయమై బామ్మర్ది షాబుద్ధీన్ తో పలుమార్లు ఘర్షణ పడేవాడని సమాచారం.సోదరి కాపురం గురించి ఆందోళన చెందే షాబుద్దీన్ బావ రహీంను మందలించే వాడని,గతంలో బామ్మర్దితో జరిగిన ఘర్షణను మనసులో పెట్టుకొని రహీం శుక్రవారం రాత్రి బామ్మర్ది షాబుద్దీన్ ఇంటికి వచ్చి,తనకు డబ్బులు కావాలని నిలదీయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు కుటుంబ సభ్యుల కథనం.
ఈ క్రమంలో రహీం తన వెంట తెచ్చుకున్న కత్తితో షాబుద్దీన్ ఛాతిపై బలంగా పొడవడంతో రెండు కత్తిపోట్లు దిగడంతో పడిపోయాడని,అప్రమత్తమైన స్థానికులు,బంధువులు గాయపడిన షాబుద్ధీన్ ని వెంటనే సూర్యాపేట జిల్లా జనరల్ హాస్పిటల్ కు తరలించారని చెబుతున్నారు.అతన్ని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందాడని ధృవీకరించారని, మృతుని బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు,సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలంచి దర్యాప్తు చేపట్టి,నిందితుడు రహీంను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ఇదిలా ఉంటే మృతిని భార్య కథనం మరోలా ఉంది.తన భర్త అతనికి బాకీ ఉన్నాడని,ఆ డబ్బుల కోసమే ఆడబిడ్డ తమ ఇంటికొచ్చిందని,తామే ఇంట్లో నుండి బయటికి వెళ్లి,బాకీ మొత్తం తీర్చామని చెబుతుంది.
నమాజ్ చేసుకొని వస్తున్న తన భర్తను తల్లి ఫోన్ చేసి పిలిచిందని,ఇంటికి వెళ్ళగానే మెట్ల దగ్గర కత్తితో రెడీగా ఉన్న రహీం పొడిచి చంపాడని, ఆ సమయంలో ఇంట్లో అందరూ ఉన్నారని,తన భర్తను చంపుతుంటే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారని,చనిపోయిన తర్వాత బయటికి వచ్చి, తనకు ఫోన్ చేసి ఇద్దరు ఘర్షణ పడ్డారని,కింద పడిపోయాడని చెప్పారని,అందరూ కలిసి నేను లేని సమయంలో ఇంటికి పిలిపించి తన భర్తను హత్య చేశారని ఆరోపిస్తోంది.దీనితో ఈ హత్య కేసులో దాగిఉన్న వాస్తవాలు ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో వెలుగు చూడాల్సి ఉంది.