కొన్ని దేశాల్లో హారన్ కొడితే వాహనదారులకు భారీగా జరిమానా విధిస్తారు.అంతేకాదు అనవసరంగా హారన్ కొట్టిన వాహనదారులను తోటి వాహనదారులు చాలా వింతగా, అసహ్యంగా చూస్తారు.
ఇలా ఆ దేశాలు వాహనదారుల్లో క్రమశిక్షణను పెంపొందించాయి.కానీ మన దేశంలో కొందరు వాహన దారులు అవసరం ఉన్నా, లేకపోయినా తమ ఇష్టానుసారం హారన్ కొడుతూనే ఉంటారు.
ఇలా తోటి ప్రయాణికులకు చికాకు పుట్టించడమే కాకుండా వీరు శబ్ద కాలుష్యాన్ని పెంచుతున్నారు.
ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు తాజాగా హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా అకౌస్టిక్ కెమెరాలను ఇంట్రడ్యూస్ చేశారు.
వీటి సాయంతో అనవసరంగా హారన్లు కొడుతూ శబ్ద కాలుష్య తీవ్రతను పెంచుతున్న వాహనదారులకు కళ్లెం వేయనున్నారు.ఇప్పటికే హైదరాబాద్ సిటీలోని చాలా చోట్ల అకౌస్టిక్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఈ కెమెరాలు 80 డెసిబుల్స్ లిమిట్ కి మించి హారన్ మోగించే వెహికల్స్ ని గుర్తిస్తాయి.వాటిని మూడు సెకన్ల పాటు ఓ వీడియో రికార్డ్ చేసి కంట్రోల్ రూంకు సెండ్ చేస్తాయి.
అనంతరం ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనాల నంబరు పేరిట ఓ చలాన్ జారీ చేస్తారు.తాజా నిబంధనల ప్రకారం పరిమితికి మించి హారన్ మోగించేవారికి రూ.1000 ఫైన్ వేస్తారు.అయితే చలాన్లు కట్టకుండా పదేపదే హారన్ కొట్టేవారిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటారు.
ఏప్రిల్ 20న హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లు, రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లపై అకౌస్టిక్ కెమెరాలతో ట్రయల్ రన్ విజయవంతంగా చేపట్టారు.అకౌస్టిక్ కెమెరా పనితీరు చాలా గొప్పగా ఉంటుంది.దీని ముందు కెమెరా ఉంటే, వెనక మైక్రోఫోన్లు ఉంటాయి.ఇది 20 డెసిబుల్స్ నుంచి 20 వేల డెసిబుల్స్ వరకు శబ్దాలను గుర్తించగలదు.