సూర్యాపేట జిల్లా:నేనెప్పుడు పడిపోతానో నాకే తెలీదు.కాబట్టి నా దగ్గరకు రాకండి,వస్తే తర్వాత మీ ఇష్టం అంటుంది తుంగతుర్తి మండల కేంద్రంలోని వినయ్ నగర్ వీధిలో ఓ విద్యుత్ స్తంభం.
దానితో అది ఎప్పుడు కూలిపోతుందో తెలియక కాలనీవాసులు క్షణంక్షణం భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.గతకొన్ని నెలలుగా కాలనీకి విద్యుత్ సరఫరా చేసే స్తంభం శిధిలావస్థకు చేరి కూలిపోయే ప్రమాదం పొంచివుందని,గట్టిగా గాలొస్తే చాలు కరెంటు స్తంభం కిందపడే అవకాశం ఉన్నదని కాలనీ వాసులు విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్నారు.
కానీ,వారి మొరను ఆలకించే నాథుడెవరూ లేక,ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక దిక్కుతోచని స్థితిలో పడ్డారు.కరెంట్ స్తంభం పరిస్థితిని చూసి ప్రజలు ఆ వీధికి రావాలంటే భయపడి పోతున్నారు.
తమ పిల్లలను ఆడుకోడానికి అటువైపు రాకుండా కాపాడుకుంటున్నారు.నిత్యం అటు నుండి వస్తూపోయే విద్యుత్ సిబ్బందికి ఈ విషయం తెలిసి కూడా పట్టకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
సమస్య చిన్నదిగా కనిపించినా ఏదైనా జరగరానిది జరిగితే పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రామస్తులు,వివిధ పార్టీ నేతలు వాపోతున్నారు.ఇప్పటికైనా విద్యుత్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కూలిపోడానికి సిద్ధంగా ఉండి,ప్రమాదకరంగా మారిన కరెంట్ స్తంభాన్ని తొలగించి,నూతన స్తంభం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.