తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారం కొరకై మధిర నియోజకవర్గంలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సోమవారం నుంచి తిరిగి ప్రారంభం అవుతున్నది.ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలోని సాయిబాబా గుడి నుంచి ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం సీఎల్పీ నేత పాదయాత్రను సోమవారం మొదలు పెడుతారు.
ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్య నాయకులతో ఈ నెల 4న సమావేశం నిర్వహించిన నేపథ్యంలో సమావేశానికి వెళ్ళడానికి భట్టి విక్రమార్క ఈ నెల 2న బోనకల్ మండల కేంద్రానికి చేరుకున్న పాదయాత్రకు చిన్న బ్రేక్ ఇచ్చి ఢిల్లీకి వెళ్లారు.అధిష్టానం తో సమావేశం ముగియడంతో ఈ నెల 11 నుంచి పాదయాత్రను బోనకల్ సాయిబాబా గుడి నుంచి యధావిధిగా కొనసాగిస్తున్నారు.16 రోజులలో ముదిగొండ, చింతకాని, బోనకల్ మండలంలోని అరవై గ్రామాలను పాదయాత్ర చుట్టేసింది.దాదాపుగా 250 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర నిర్వహించి సీఎల్పీ నేత విక్రమార్క ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజల గొంతుకగా అసెంబ్లీలో గళం వినిపించారు.అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్లిన పలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించింది.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మూడు లక్షలు మంజూరు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి విధుల్లోకి తీసుకోవడం, మెప్మా, సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తానన్న ప్రకటన, కల్లుగీత కార్మికులకు మోపెడు వాహనాలు పంపిణీ చేస్తామని, గీత సొసైటీలకు తాటి ఈత వనాల పెంపకంలో కోసం స్థలం కేటాయింపు పై ప్రభుత్వం ప్రకటన చేసే విధంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర దోహదపడింది.కాగా పాదయాత్ర 17వ రోజులో భాగంగా సోమవారం బోనకల్ మండల కేంద్రంలోని సాయిబాబా గుడి నుంచి బోనకల్ రైల్వే బ్రిడ్జి మీదుగా రావినూతల, గార్లపాడు, రామాపురం గ్రామాల్లో సుమారుగా 12 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుంది.
అదే రోజు రాత్రి రామాపురంలోని నల్లమోతు సత్యనారాయణ ఇంట్లో బస చేస్తారు.







