ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది.ఈ ఫొటోలో ఒక పదేళ్ల బాలిక తన చిట్టి చెల్లెలిని ఎత్తుకొని పాఠాలు వింటున్నట్లు గమనించొచ్చు.
ఈ చిత్రాన్ని మణిపూర్ విద్యుత్, అటవీ శాఖ మంత్రి బిశ్వజిత్ తొంగమ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.ఈ ఫొటోని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇంత చిన్న వయసులో చిన్న బిడ్డని ఎత్తుకొని స్కూల్ కి హాజరైన ఈ బాలికను చూసి వావ్ అంటున్నారు.ఒకవైపు చిట్టి చెల్లెలు ఆలనాపాలనా చూసుకుంటూనే మరోవైపు పాఠాలు నేర్చుకుంటున్న ఈ బాలికని చూసి ముచ్చట పడుతున్నారు నెటిజన్లు.
చదువుకోవాలన్న ఆమెలోని తపనని బాగా మెచ్చుకుంటున్నారు.
వైరల్ అవుతున్న చిత్రంలో మణిపూర్లోని తమెంగ్లాంగ్కు చెందిన మెయినింగ్సిన్లియు పామీ అనే 10 ఏళ్ల బాలికని చూడొచ్చు.
ఈ బాలిక తన చెల్లెల్ని ఎత్తుకొని పాఠశాలకు హాజరు అవుతుంటుంది.ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు ఉదయాన్నే వ్యవసాయ పనులకు వెళ్లి సాయంకాలానికి తిరిగి ఇంటికి వస్తారు.ఇలా పనులతో బిజీగా ఉండే తల్లిదండ్రులు తమ బిడ్డను చూసుకోలేక తన పెద్ద కూతురుకే బిడ్డ బాధ్యతలను అప్పజెప్పారు.
అయితే ఈ బాలిక తన సిస్టర్ తో పాటే ఇంటి దగ్గర ఉండకుండా పాఠశాలకు వస్తోంది.
అలా ఈ బాలిక చదువుకుంటూ అందరి ప్రశంసలు దక్కించుకుంటోంది.మెయినింగ్సిన్లియు తన చేతుల్లో తన చిట్టి చెల్లెల్ని నిద్రపుచ్చి పాఠాలు వినడం చూసి బిశ్వజిత్ తొంగమ్ చలించిపోయారు.
చిన్నారి చూపిన అంకితభావానికి మంత్రముగ్ధులైన బిశ్వజిత్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ ఫొటోని షేర్ చేశారు.“చదువు పట్ల ఆమెకున్న డెడికేషన్ నన్ను ఆశ్చర్యపరిచింది!” అని ఆయన పోస్టులో రాసుకొచ్చారు.







